Betting Apps Case: యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు తెలుగు సినీ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సమన్లు అందుకున్న ప్రముఖుల్లో రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రకాష్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఉన్నారు. వీరిలో రానా జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని సమన్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రముఖులు బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాలుపంచుకున్నారా? లేదా? వాటితో ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిపారా? అనే కోణంలో ఈడీ విచారించనుంది. గతంలో కూడా వివిధ కేసుల్లో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెట్టింగ్ యాప్లు, మనీలాండరింగ్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తును వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Also- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో పెను సంచలనం.. ‘ఈనాడు’కు కోట్లల్లో ముడుపులు!
ఇదీ అసలు సంగతి..
భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి ఈ యాప్లు నడుస్తున్నాయని, మనీలాండరింగ్కు పాల్పడుతున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈడీ, సీబీఐ (ED, CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ముఖ్యంగా, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతూ, అక్రమంగా సంపాదించిన డబ్బును మళ్లించడంపై ఈడీ దృష్టి పెట్టింది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ముంబై ఈడీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, నగల వ్యాపారులకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసి విచారించింది. సినీ ప్రముఖులకు (Tollywood Celebrities) ఈడీ సమన్లు జారీ చేయడానికి ప్రధాన కారణం వారి ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారం లేదా వాటితో సంబంధం ఉన్న ఇతర లావాదేవీలు కావచ్చు. కొంతమంది నటులు, నటీమణులు వివిధ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను లేదా వాటి అనుబంధ యాప్లను ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ అధికారులు క్రిప్టోకరెన్సీ యాప్లతో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును క్రిప్టోకరెన్సీల ద్వారా మళ్లించడం, ఆపై వాటిని సినిమా రంగంలోకి లేదా ఇతర వ్యాపారాల్లోకి తరలించడంపై ఈడీకి అనుమానాలు ఉన్నాయి.
విచారణలో ఏం తేలుస్తారు?
ముంబై కేంద్రంగా ప్రారంభమైన ఈ దర్యాప్తు ప్రస్తుతం హైదరాబాద్కు విస్తరించింది. టాలీవుడ్లో కొందరు ప్రముఖులు ఈ బెట్టింగ్ సిండికేట్లతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతోనే ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. ఈడీ అధికారులు.. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలను వారి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు, ఈ బెట్టింగ్ యాప్లతో వారికి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో విచారించనున్నారు. వారి ఆర్థిక మూలాలపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ ఆరోపణలతో కూడుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేయడం ద్వారా, ఈ అక్రమ లావాదేవీల నెట్వర్క్ ఎంత పెద్దది అనేది బయటపడవచ్చు. ఈ విచారణలు టాలీవుడ్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఈడీ విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi), యాంకర్ శ్యామల (Anchor Shyamala), యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ (Bhayya Sunny Yadav) , లోకల్ బాయ్ నానిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని ఈడీ విచారించనున్నది. ఇప్పుడు కొందరికే నోటీసులు ఇవ్వగా.. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చి ఈడీ విచారించనున్నది.
Read Also- Pak on India: ‘వరల్డ్ కప్లో మాతో ఆడకండి’.. టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ ఫైర్!