TS High Court:
వ్యాపార స్వేచ్ఛ ప్రాథమిక హక్కు
తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు
సెలూన్ బిజినెస్ చేయవద్దంటూ ముస్లిం వ్యక్తిపై దాడి
రక్షణ కల్పించకుండా బెదిరించిన పోలీసులు
బాధితుడు ఆశ్రయించడంతో న్యాయస్థానం అండ
హైదరాబాద్, స్వేచ్ఛ: వ్యాపార స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జీ)) ప్రకారం స్వేచ్ఛాయుతంగా వ్యాపారం నిర్వహించుకునే హక్కు పౌరులకు ఉంటుందని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. సెలూన్ బిజినెస్ నిర్వహించొద్దంటూ కొందరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు కదా, పైగా వారు కూడా బెదిరింపులకు దిగారంటూ హైదరాబాద్కు చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన న్యాయస్థానం పిటిషనర్కు చెందిన ప్రిన్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ బ్యూటీ పార్లర్ అనే సెలూన్కు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also- Malnadu restaurant drugs case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసు వర్గాల్లో ఉత్కంఠం
ఫిర్యాదుదారుడి వ్యాపారానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు వికారాబాద్ పోలీస్ స్టేషన్కు సూచనలు చేసింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రతి మూడు గంటలకు ఒకసారి సెలూన్ను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విధంగా నెలరోజుల పాటు సెలూన్ వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలను లాగ్బుక్లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిర్యాదుదారుడికి కూడా భద్రత కల్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read Also- HCA: తవ్వేకొద్దీ అవినీతి.. హెచ్సీఏ ప్రక్షాళన ఎప్పుడు?
మంగలివారే నిర్వహించాలంటూ..
సెలూన్ నడిపే హక్కు మంగలి కులానికి మాత్రమే చెందుతుందని, తమ చేతి వృత్తిని ఇతరులు చేపట్టరాదని వాదిస్తూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పిటిషనర్ ఫిరోజ్ ఖాన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. సెలూన్ను అడ్డుకునేందుకు దాడి చేసి, బెదిరించారని వివరించాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం వహించారని పిటిషనర్ తరపున రఘునాథ్ అనే సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధిత వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే, రివర్స్లో పోలీసులే బెదిరింపులకు పాల్పడ్డారని, సెలూన్ తెరిస్తే కేసులు బనాయిస్తామంటూ హెచ్చరించారని, అందుకే పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ వినోద్ కుమార్, పిటిషనర్ వ్యాపారానికి రక్షణ కల్పిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. హోం శాఖ తరఫున కోర్టులో హాజరైన ప్రభుత్వ న్యాయవాది, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలియజేశారు.
Read Also- Health: మంచి ఫుడ్ తిన్నా అనారోగ్యమేనా?, అయితే ఇది మీకోసమే!
