SRH HCA Dispute: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్… సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) మధ్య తలెత్తిన వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సీఐడీ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతోపాటు బాడీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
వివాదానికి కారణం ఏంటంటే?
ఐపీఎల్ మ్యాచ్ సమయంలో టిక్కెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jagan Mohan Rao)తోపాటు బాడీలోని మరికొందరు సభ్యులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ ఆరోపించిన విషయం తెలిసిందే. అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వలేదని తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ ఆరోపించింది. అవసరమైతే హైదరాబాద్ నుంచి మారిపోతామని కూడా అప్పట్లో స్పష్టంగా ప్రకటించింది.
సీఎం సీరియస్.. విచారణకు ఆదేశం
సన్ రైజర్స్, హెచ్ సీఏ మధ్య చెలరేగిన టికెట్ల వివాదం తీవ్ర దుమారం రేపడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో సీరియస్ అయ్యారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సన్ రైజర్స్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాజీకి వచ్చారు. ఈ మేరకు తమ మధ్య రాజీ కుదిరినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.
10శాతం టికెట్లకు డిమాండ్
అయినా జరిగిన వివాదంపై విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగించారు. దీంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షునిగా ఉన్న జగన్మోహన్ రావు అదనపు టిక్కెట్ల కోసం సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. అప్పటికే సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ స్టేడియం కెపాసిటీలో 10శాతం టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నా మరో 10శాతం టిక్కెట్లను వ్యక్తిగతంగా ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. అదనంగా మరో 10శాతం టిక్కెట్లు ఇచ్చేది లేదని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ స్పష్టం చేసిననట్టుగా వెల్లడైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా రిక్వెస్ట్ పెడితే టిక్కెట్లు ఇస్తామని చెప్పినట్టుగా తేలింది.
Also Read: Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’.. టైటిలే ఇలా ఉంది.. ఇక సిరీస్ ఎలా ఉంటుందో?
ఇబ్బంది పెట్టింది నిజమే!
హెచ్ సీఏ ద్వారా రిక్వెస్ట్ పంపాలన్న సన్ రైజర్స్ ప్రతిపాదనకు జగన్మోహన్ రావు అసహనం వ్యక్తం చేసినట్లు కమిటీ విచారణ తేలింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ల సందర్భంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురి చేసినట్టుగా స్పష్టమైంది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేసినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు.