Sridhar Babu: తెలంగాణ యువతను ఏఐ రంగంలో అత్యుత్తమ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో 2 లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బుధవారం టీ-హబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ అనుసంధానిత “తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్”ను మంత్రి ప్రారంభించారు. “ప్రస్తుతం ఏఐ కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు, మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. కొత్తగా ఎన్నో అవకాశాలను సృష్టించింది. ఈ మార్పును అందిపుచ్చుకుని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఆ దిశగా ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ను రూపొందించుకుని వడివడిగా అడుగులు వేస్తుంది” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
టెక్ పౌరసత్వానికి పునాది..
ఏఐని ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా, అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా టీజీడీఈ పేరుతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. దీని రూపకల్పనలో బెంగళూరులోని ఐఐఎస్సీ వ్యూహాత్మక సహకారం అందించిందని, ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్ అని పేర్కొన్నారు. “ఇది కేవలం డేటా ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాత్మకమైన టెక్ పౌరసత్వానికి బలమైన పునాది” అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్లు, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకి వచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు టీజీడీఈ మార్గం చూపుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికే 480కి పైగా డేటాసెట్స్, 3 వేలకు పైగా ఏఐ స్టార్టప్లు ఇందులో భాగస్వాములయ్యాయని తెలిపారు. టీజీడీఈ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్లకు డేటా లభిస్తుందని, రోగులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన ఏఐ మోడల్స్ను అభివృద్ధి చేయవచ్చని, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Gujarat lawyer: వామ్మో ఇదేందయ్యా ఇది.. జడ్జి ముందే బీర్ కొట్టిన లాయర్.. వీడియో వైరల్!
30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులు
గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేలా నూతన ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతుందని, పౌర సేవలను సమర్థవంతంగా ప్రజల ముంగిట చేరుకునేందుకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని శ్రీధర్ బాబు అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒకే దగ్గర సమాచారం అంతా అందుబాటులో ఉంటుందన్నారు. టీజీడీఈలో రాబోయే ఐదేళ్లలో 2 వేల డేటాసెట్స్ను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పాలనలో ఏఐ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని, త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే నిపుణులను తయారు చేసేలా ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులమ్ను రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, టీ-హబ్ సీఈవో కవికృత్, టీ-వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టకుచి ఠాకురో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు.