Metro: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అలియాస్ రాములమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కేంద్రం, రాష్ట్రంలోని కమలనాథులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ ఇటు రాష్ట్రంలో.. అటు ఢిల్లీలో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. దీంతో నెటిజన్లు, అభిమానులు, తెలంగాణ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందిస్తున్నది. ‘ రాములమ్మ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం, మెట్రో అభివృద్ధి విషయంలో బీజేపీ పాత్ర శూన్యం.. ఇది వెయ్యి శాతం నిజం’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ‘ ప్రజా శ్రేయస్సే ముఖ్యమైతే తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మెట్రో విస్తరణ విషయంలో విజయశాంతి చెప్పినట్లు చొరవ చూపాలి’ అని సలహాలు ఇస్తున్నారు. ‘ కాంగ్రెస్ హయాంలో మెట్రో పూర్తిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందనే కేంద్రం మెట్రో విస్తరణ విషయంలో జాప్యం చేస్తోందని అనిపిస్తోంది’ అని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాములమ్మ ట్వీట్ సారాంశం ఏమిటో చూసేద్దాం రండి..
రండి.. నాతో రండి!
‘ హైదరాబాద్లో మెట్రో రైలు రెండవ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి అనుసరిస్తోందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రెండో దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా ఫలితం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే కారణం వల్లే కేంద్రం మెట్రో విస్తరణపై జాప్యం చేస్తోందన్న వాదన కూడా ఉంది. రాజకీయాలు పక్కనపెట్టి హైదరాబాద్ జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో 42 మంది కార్పోరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా బీజేపీ మెట్రో విస్తరణ ప్రతిపాదన ఆమోదం పొందేందుకు చొరవ చూపాలి. అప్పుడే తమను నమ్మి ఓటు వేసిన గ్రేటర్ ప్రజలకు న్యాయం చేసిన వారవుతామనే వాస్తవాన్ని బీజేపీ గుర్తించాలి. కేంద్ర మంత్రులను మెట్రో రెండో దశ ప్రతిపాదనపై ఒప్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎంపీలతో పాటు హైదరాబాద్కు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. అలా చేయడానికి బీజేపీ సిద్దపడితే వారితో కలిసి కేంద్ర మంత్రులను కలిసి మెట్రో ప్రాజెక్ట్ అనుమతి పొందే ప్రయత్నానికి హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా నాతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ విషయంలో నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైనే ఉందనే విషయాన్ని ఆ పార్టీ గుర్తించాలి.
Read Also- Nara Lokesh: నారా లోకేష్పై కుట్ర జరుగుతోందా.. ఇలా ఉన్నారేంట్రా?
ఏమిటీ రెండవ దశ?
హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశలో ఐదు కారిడార్లు ఉన్నాయి. కారిడార్ 4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు (దాదాపు 36.6 కి.మీ.) – ఇది ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట, ఆరామ్ఘర్ మీదుగా ఉంటుంది. ఇందులో భూగర్భ మార్గం కూడా ఉంటుంది. కారిడార్ 5 రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు (సుమారు 11.6 కి.మీ.). కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కి.మీ.). ఇది పాతబస్తీలోని దారుల్ షిఫా, శాలిబండ, ఫలక్నుమా మీదుగా వెళ్తుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. కారిడార్ 7 మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు (సుమారు 13.4 కి.మీ.) ఆల్విన్ ఎక్స్ రోడ్, చందానగర్, మదీనగూడ, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ మీదుగా వెళ్లనుంది. కారిడార్ 8: ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు (7.1 కి.మీ.). ఈ 5 కారిడార్ల మొత్తం పొడవు 76.4 కిలోమీటర్లు, 54 స్టేషన్లు ఉండనున్నాయి. దీని అంచనా వ్యయం సుమారు రూ.24,269 కోట్లు.
ఈ మధ్యనే ఇలా..?
ఫేజ్ 2 (బీ) తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన మూడు కొత్త కారిడార్లు ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు (అంచనా వ్యయం రూ. 7,168 కోట్లు). జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) నుంచి మేడ్చల్ వరకు: 24.5 కిలోమీటర్లు (అంచనా వ్యయం రూ. 6,946 కోట్లు). జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) నుంచి శామీర్పేట వరకు: 22 కిలోమీటర్లు (అంచనా వ్యయం రూ. 5,465 కోట్లు). ఈ మూడు కారిడార్ల మొత్తం పొడవు 86.1 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ. 19,579 కోట్లు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫేజ్ 2 (బి) ప్రాజెక్టుకు రూ. 19,579 కోట్లతో పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వ వాటా 30% కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా 18% గా ఉండనుంది. మిగిలిన నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా (48%), పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో (4%) సమకూర్చుకోనున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఇప్పటికే ఫేజ్ 2B కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను (DPRs) పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో ఫేజ్-IIకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణతో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. తద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.
Read Also- Chandrababu: కుప్పం ప్రజలకు సీబీఎన్ అదిరిపోయే శుభవార్త.. ఎగిరి గంతేస్తున్న జనం!
హైదరాబాదులో మెట్రో రైలు రెండవ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి అనుసరిస్తోందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారీ ప్రధాని మోడీగారితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రెండో దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు… pic.twitter.com/wx2LMSR80M
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 2, 2025