Minister Sridhar Babu: ఈ-గవర్నెన్స్కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త సేవలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu)ప్రారంభించారు. దీంతో పాటు స్లాట్ బుకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చింది.
నూతన పౌర సేవల ప్రారంభం, మీ సేవ కార్యక్రమాల పనితీరుపై సోమవారం సచివాలయంలో అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) సమీక్ష నిర్వహించారు. ఈ కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతతో కూడిన, వేగవంతమైన సేవలుగా మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు. భూమి, అపార్ట్మెంట్ విలువల అంచనాలను 24 గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపడుతున్నారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (Marriage registration) ప్రక్రియ కూడా ఇకపై సమర్థవంతంగా జరగనుంది.
Also Read: Medical Colleges: మెడికల్ కాలేజీలకు వెయ్యి కోట్లు?
ప్రజలకు మరింత చేరువ..
మీ సేవ సెంటర్ లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందవచ్చు. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం త్వరితగతిన పరిశీలించి నిర్ణయిస్తుంది. ఇందులో స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయస్సు ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఆమోదం అనంతరం సర్టిఫికెట్ను ప్రత్యక్షంగా సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి జారీ చేస్తారు.
ఈ సేవల ద్వారా ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిర్మాణ రంగం, స్థిరాస్తి కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటికే మీ సేవలో ఆర్టీఏ, పాన్, ఇసుక బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై టీ-ఫైబర్, అదనపు కియాస్క్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తెలిపారు. వివరాల కోసం అధికారిక మీ సేవ వెబ్సైట్ను లేదా స్థానిక మీ సేవ కేంద్రాలను సంప్రదించాలని మంత్రి కోరారు.
Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజానికి ప్రతినెలా 50 లక్షల నష్టం!