Amrapali Kata: అవును.. యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాట (Amrapali Kata) తిరిగి తెలంగాణకు వచ్చేస్తున్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు విచ్చేస్తున్నారు. మంగళవారం నాడు ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మేడంకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, డీఓపీటీ ఉత్తర్వులతో 4 నెలల క్రితం ఆమ్రపాలి ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనను తెలంగాణకు కేటాయించాలని క్యాట్లో పిటీషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి పిటీషన్ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ అనుమతించినది. ఇదిలా ఉంటే.. డైనమిక్ను తెలంగాణకు కేటాయించాలని రేవంత్ సర్కార్ (Revanth Govt) పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మేడంకు క్యాట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే రేవంత్ ప్రభుత్వం పంతం నెగ్గించుకున్నదని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ ఆమ్రపాలి ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? ఎందుకు ఏపీకి వెళ్లాల్సి వచ్చింది..? తిరిగి ఎందుకు తెలంగాణకు వస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
Read Also- Gadwal Incident: హార్ట్ బ్రేకింగ్.. ఇలా చేసుంటే తేజేశ్వర్ బతికేవాడేమో!
ఎవరీ మేడం?
ఆమ్రపాలి 1982 నవంబర్ 4న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి విశ్రాంత ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు. విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లో ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత చెన్నైలోని ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రురాలయ్యారు. అనంతరం ఐఐఎమ్ (IIM) బెంగళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో (MBA) పట్టభద్రురాలై, సివిల్ సర్వీసెస్లో చేరడానికి ముందు ఓ బ్యాంక్లో పనిచేశారు. 2010లో యూపీఎస్సీ పరీక్షలో 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ఏపీ కేడర్కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. ఆమెను ‘యువ డైనమిక్ ఆఫీసర్’గా పిలుస్తుంటారు. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా నియమించబడిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి. ఆమ్రపాలి తన కెరీర్లో తెలంగాణలో అనేక కీలక పదవులను నిర్వహించారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఈ సమయంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలు, విద్యార్థులు, యువతలో చాలా పేరు తీసుకొచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదనపు కమిషనర్గా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.
Read Also-Preity Mukhundhan: ‘కన్నప్ప’లో హీరోయిన్ ఉందా? ఉంటే ఎ క డ?
కేంద్రంలోనూ బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్గా పనిచేసిన తర్వాత, ఆమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్ళారు. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేటు సెక్రటరీగా, ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. 2023 డిసెంబరు 14న, కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కమిషనర్గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా నియమించింది. 2024 జూన్ 24న ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా, ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. అక్టోబర్ 2024లో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆమె తెలంగాణ కేడర్ అభ్యర్థనను తిరస్కరించి, ఆంధ్రప్రదేశ్ కేడర్కు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. అప్పట్లోనే క్యాట్ను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక ఏపీకి వెళ్లిన ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలను చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. కాగా, ఆమె భర్త సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారి. ఆమ్రపాలి తన నిబద్ధత గల పనితీరు, కఠినమైన నిర్ణయాలు, ప్రజలతో సులువుగా మమేకమయ్యే విధానంతో ‘డైనమిక్ ఆఫీసర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి ‘మేడం సార్.. మేడం అంతే’ అని అనిపించుకోవడానికి ఆమ్రపాలి తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఈసారి మేడం మార్క్ ఎలా ఉంటుందో చూడాలి మరి..!
Read Also- Marriage: 12 పెళ్లిళ్ల నీలిమ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్..