Raja Singh:
- నన్ను టార్గెట్ చేయడం కాదు
నన్ను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది?
119 స్థానాల్లో గెలుపుపై దృష్టి పెట్టండి
కిషన్ జీ.. మాట్లాడేందుకు కాస్త సమయమివ్వండి
వ్యక్తిగత విభేదాలు విడిచిపెట్టి ఐక్యంగా పనిచేద్దాం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తనను టార్గెట్ చేయడం కాకుండా, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విజయం ఎలా సాధించాలో దృష్టిపెట్టాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజాసింగ్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఆయన మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. ఒక్క రాజాసింగ్ను ఇబ్బంది పెడితే ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు. తాను పార్టీ కోసం, పార్టీ ఐక్యత కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని అన్నారు. తాను పార్టీని విభజించేందుకు కొనసాగడం లేదని, పదవుల కోసం పార్టీలో పని చేయడం లేదని చెప్పుకొచ్చారు.
లక్షలాది కార్యకర్తల మనోబలం దెబ్బతింటోందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమకు కొంత సమయం ఇవ్వాలని, కలిసి మాట్లాడతామని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్నానని, తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, తన దృష్టి, తన కృషి పార్టీ బలోపేతంపైనే ఉందని పేర్కొన్నారు. రాజాసింగ్ ఒక సీనియర్ నాయకుడని, తానొక సామాన్య కార్యకర్తనని కిషన్ రెడ్డి అన్నారని, రాజాసింగ్ ఏం చెబితే దాన్ని తాము పాటిస్తామని చెప్పారంటూ గోషామహల్ ఎమ్మెల్యే గుర్తుచేశారు. కానీ, సమస్యలు చెప్పుకునేందుకు కిషన్ రెడ్డి సమయం కేటాయించాలని కోరారు. తమ నిజమైన లక్ష్యాన్ని మరచిపోకూడదని, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరముందని, అందుకోసం వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి ఐక్యంగా పనిచేద్దామంటూ రాజాసింగ్ పిలుపునిచ్చారు.
Read this- Hydraa News: హైడ్రా చీఫ్ వద్దకు స్కూల్ పిల్లలు.. విషయం ఏంటంటే?
ఇంజినీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరిట దోపిడీ: బీజేపీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో డొనేషన్ల పేరిట జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్న విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా, మహేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థుల సీట్ల భర్తీ అంశంపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. డొనేషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం మోపుతూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read this- Viral News: ప్రియుడితో లేచిపోయిన నవ వధువు.. సంతోషంలో భర్త.. ఎందుకంటే?
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ విడుదలవ్వకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మహేందర్ పేర్కొన్నారు. అలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని,అలాగే ఈ సమస్య పరిష్కారమయ్యేలా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, తరుణ్, చిత్తరంజన్, కుమార్, సంతోశ్, ప్రధాన కార్యదర్శులు సామల పవన్, గణేష్, సురేష్, కోశాధికారి యోగి, కార్యదర్శి ప్రవీణ్, అశోక్, నాయకులు సుధీంద్ర శర్మ, అరవింద్, వినీత్, అనిత, మహేందర్, భగీరత్, నితిన్, అవినాష్, నరేన్, గోవర్ధన్, రామకృష్ణ, ఆకాష్, అరుణ్, చక్రి, వినయ్, రాఘవేంద్ర, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.