Minister Ponguleti Srinivas Reddy: కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమావేశం ఎర్పాటు చేశారు. ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని, రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీ పై స్పష్టత వస్తుందని అన్నారు.
ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండని అన్నారు. ఎన్నికలకు రావడానికి ఇంకా 15రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండని అన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు.
Also Read: ISRO – Ax-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. డేట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఎప్పుడంటే?
అన్ని ఎకరాల వరకు రైతు భరోసా
రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమా చేయడం జరుగుతుందని అన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని, మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలని తెలిపారు.
అరకపట్టి పొలం దున్నిన మంత్రి
రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజవర్గం పర్యటనలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అరక పట్టి పొలం దున్నారు. రైతు సోదరులకు, మహిళా కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది మంచి వర్షాలు పడి పాడిపంటల ఎగుమతిలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానానికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
Also Read: Mahesh Kumar Goud: మనలో ఐక్యత లోపించింది.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు