HYDRAA Plan:
- మొత్తం 150 బృందాల ఏర్పాటుకు కసరత్తు
వీటికి తోడు 30 డీఆర్ఎఫ్ టీమ్ల సమన్వయం
30 ప్యాకేజీలుగా టెండర్ల ప్రక్రియ
ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక టీమ్
ఒక్కో టీమ్కు ఒక వాహనం, డ్రైవర్తో కలిపి 5 మంది మ్యాన్ పవర్
లేబర్, వాహనాల కోసం ఇంటిగ్రేటెడ్ టెండర్లు
జీహెచ్ఎంసీ తరహాలోనే చేపట్టే యోచనలో హైడ్రా
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: వర్షాకాలం కష్టాలను తగ్గించి, వరదలు ఉత్పన్నమైతే అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు హైడ్రా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను (Hydraa Monsoon Plan) సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 150 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండేలా ఈ టీమ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి తోడు ఇప్పటికే 24 గంటలు అందుబాటులో ఉన్న 30 డిజాస్టర్ రెస్క్యూఫోర్స్ కూడా ఈ మాన్సూన్ టీమ్లను సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించేలా యాక్షన్ ప్లాన్ను సిద్దం చేసింది. ఇందులో భాగంగానే వాటర్ లాగింగ్ పాయింట్లు, చెట్లు విరిగి పడినా, విద్యుత్ తీగల తెగి పడినా చాకచక్యంగా విధులు నిర్వర్తించే విధంగా సంసిద్ధంగా ఉండనున్నారు. అందుకు అవసరమైన యంత్రాలు, వాహనాలను సమకూర్చుకునేందుకు హైడ్రా శనివారం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, జీహెచ్ఎంసీ ఏర్పడిన నాటి నుంచి మొదటి సారి జీహెచ్ఎంసీ స్థానంలో వేరే సంస్థ మాన్సూన్ సహాయక చర్యలను చేపట్టేందుకు సిద్దమైంది. జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, వాహనాలను సమకూర్చుకునేందుకు పక్షం రోజుల క్రితం టెండర్ ప్రకటన జారీ చేశారు. అందులో నెలకు రూ. 63వేల అద్దె చెల్లించేలా ఇసుజు వాహనాలు ఉండటం తప్పనిసరి చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళనకు గురయ్యారు.
Read this- Plane Crash: ‘11ఏ’ సీటు మిస్టరీ.. 27 ఏళ్లక్రితం ‘సేమ్ మిరాకిల్’
కొందరు అధికారులు కేవలం కొద్ది మంది కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఇసుజు వాహనాల నిబంధన పెట్టినట్లు గుర్తించిన సర్కారు ఆ టెండర్లను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు మున్సిపల్ శాఖ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు, కావాల్సిన వాహనాలు, మిషనరీని ఈ సారి హైడ్రా సమకూర్చాలని బాధ్యతలను బదలాయించింది. దీంతో, మరో మూడు నెలల వర్షాకాలానికి సంబంధించి, సిటీలోని మొత్తం 30 సర్కిళ్లలో 150 వార్డుల్లోని వాటర్ లాగింగ్ పాయింట్లు, చిన్న పాటి వర్షానికే భారీగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ సహాయక చర్యలను చేపట్టేందుకు మొత్తం 150 టీమ్లను సంసిద్ధం చేయాలనే నిర్ణయానికొచ్చింది. హైడ్రా గతంలో జీహెచ్ఎంసీ నిర్వర్తించిన విధంగానే ఈ సారి వర్షాకాలం సహాయక చర్యలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, హైడ్రా ఈ టెండర్లను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు టెండర్ల సమర్పణకు గడువు విధించింది. 4 గంటల తర్వాత టెక్నికల్ బిడ్లు, ప్రైస్ బిడ్లను హైడ్రా అధికారులు ఓపెన్ చేయనున్నట్లు తెలిసింది. సహాయక చర్యల కోసం అవసరమైన లేబర్, వాహనాల కోసం హైడ్రా మొదటి సారిగా ఇంటిగ్రేటేడ్ టెండర్లను ఆహ్వానించింది. మరో ఐదారు రోజుల్లో ఈ టీమ్లు సిద్దం కానున్నట్లు తెలిసింది.
Read this- Plane Tragedy: విమానంలో ఆటో డ్రైవర్ కూతురు.. గుండె తరుక్కుపోయే విషాదం
ఐదు నెలలు అందుబాటులో…
ప్రస్తుతం హైడ్రా టెండర్ల ప్రక్రియ చేపట్టిన ఈ మాన్సూన్ టీమ్లు సుమారు ఐదారు నెలల పాటు అందుబాటులో ఉండేలా టెండర్ నిబంధనల్లో హైడ్రా నిబంధన విధించింది. ఇప్పటికే ఒక నెల వర్షాకాలం గడిపోయి, కేవలం మూడు నెలల వర్షాకాలం మిగిలి ఉన్నా, ఆ తర్వాత కూడా వర్షాలు పడితే సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో హైడ్రా ఉన్నట్టు సమాచారం. ఒక్కో మున్సిపల్ వార్డుకు ఒక్కో టీమ్ను ఏర్పాటు చేయాలని హైడ్రా భావిస్తోంది. ఇందులో ఒక వాహనం, డ్రైవర్తో పాటు నలుగురు సిబ్బంది ఉండేలా ఈ టీమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఈ సారి హైడ్రా వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తోంది. జీహెచ్ఎంసీ ఒకేసారి ఇసుజు వాహనాల నిబంధన పెట్టి, విఫలం కావడంతో హైడ్రా టాటా ఏఎస్, మహేంద్ర, మారుతీ సుజుకి సూపర్ క్యారీ వాహనాలను సమకూర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. పైగా లేబర్, వాహనాలను సమకూర్చే కాంట్రాక్టర్ గడిచిన ఐదారేళ్లలో కనీసం ఒక్కసారైనా వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టిన అనుభవం ఉండాలన్న నిబంధనను పెట్టింది. ‘రౌండ్ ది క్లాక్’ అందుబాటులో ఉండే టీమ్లలోని లేబర్స్కు డే షిఫ్టులో విధులు నిర్వహించినట్లయితే రూ.805, నైట్ షిఫ్టులో పని చేస్తే రూ.945.75 గా రోజువారీ వేతనాలను హైడ్రా ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనికి తోడు డ్రైవర్ కు నెలకు రూ.15 వేల జీతాన్ని చెల్లించనున్నట్లు హైడ్రా టెండర్ నిబంధనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేగాక, సమకూర్చుకునే ఒక్కో వాహానానికి నెలకు రూ. 30 వేల అద్దె చెల్లించాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది వరకు జీహెచ్ఎంసీ ఒక్కో వాహానానికి రూ. 33వేలను అద్దెగా చెల్లించేది. కానీ ఈ సారి హైడ్రా ఆ అద్దెను సైతం రూ.30 వేలకు తగ్గించింది.