Hydraa: ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో పాటు, మహానగరానికి మూడు రోజుల వర్ష సూచన వెలువడగా, జీహెచ్ఎంసీ అధికారులు వర్షాకాల సహాయక చర్యల్లో అక్రమాలకు పాల్పడటంతో ఆ బాధ్యతలను హైడ్రాకు బదలాయిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, హైడ్రా వర్షాకాల సహాయక చర్యలపై ఎలాంటి కసరత్తు చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత సంవత్సరం (2024) జూన్ మాసం చివరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై-సిటీల్లోని ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, కుంటలను కాపాడటంతో పాటు, పది రోజుల క్రితం నుంచీ నాలా ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, వర్షాకాల సహాయక చర్యల నిమిత్తం రూ. 55 కోట్ల వ్యయంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు, లేబర్ స్టాటిక్ టీమ్లతో పాటు 164 వాహనాలను టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూర్చాల్సి ఉంది.
ఏకంగా రూ.63వేలకు పెంపు
వాహనాల విషయంలో జీహెచ్ఎంసీ రెండింతలు అద్దెలు చెల్లించేందుకు ప్రయత్నించి, ఇసుజు వాహనాలను మాత్రమే ఎంగేజ్ చేయాలన్న నిబంధన పెట్టడంతో టెండర్ల ప్రక్రియలోని అసలు దోపిడీ బట్టబయలైంది. గతంలో జీహెచ్ఎంసీ నెలకు కేవలం రూ. 30 వేల అద్దెతో ఒక్కో వాహనాన్ని సమకూర్చేది. కానీ, జీహెచ్ఎంసీ చేపట్టిన టెండర్లలో ఇసుజు వాహనాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనతో పాటు, ఒక్కో వాహనం అద్దెను ఏకంగా రూ. 63 వేలకు పెంచి, బల్దియా ఖజానాకు కన్నం వేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారన్న విషయాన్ని మున్సిపల్ శాఖ గుర్తించింది.
టెండర్ల ప్రక్రియకు ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం ఆదేశాలు జారీ చేయడంతో, ఆ బాధ్యతలను బల్దియా నుంచి హైడ్రాకు బదిలీ చేశారు. దీంతో, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు, లేబర్ స్టాటిక్ టీమ్లతో పాటు 164 వాహనాలను సమకూర్చుకునేందుకు హైడ్రా టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే, త్వరలో హైడ్రా చేపట్టనున్న టెండర్ల ప్రక్రియలో కూడా ఇసుజు వాహనాల ప్రస్తావన ఉంటుందా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి హైడ్రా ఏర్పడి సంవత్సరం కూడా గడవలేదు. ఇప్పటి వరకు వర్షాకాల సహాయక చర్యలు పెద్దగా చేపట్టిన అనుభవం లేకపోవడం, వానాకాలం సహాయక చర్యల్లో పాల్గొనే మాస్ టీమ్ కూడా హైడ్రా వద్ద లేకపోవడంతో, ఈ సంవత్సరం హైడ్రా వానాకాల కష్టాలను ఎలా తగ్గిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
సమన్వయం కుదిరేనా?
మాన్సూన్ సహాయక చర్యల్లో భాగంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు, లేబర్ స్టాటిక్ టీమ్లతో పాటు 164 వాహనాలను సమకూర్చుకునే బాధ్యతలతో పాటు, వర్షకాల సహాయక చర్యలు, వాటర్ లాగింగ్ పాయింట్లలో మోటార్ల సహాయంతో నీటిని తోడేయడం, అవసరమైతే అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నాలా సేఫ్టీ, నాలా ఆడిట్, నాలాల వద్ద ప్రమాదాల నివారణ చర్యలు, వర్షాకాలం తర్వాత నాలాల్లోని పూడికతీత పనులు, నాలాల నుంచి బయటకు తీసిన పూడికను రోడ్లపై నుంచి తరలించడం, నాలాల్లో వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించడం, చెట్లు విరిగిపడినా, కరెంటు స్తంభాలు నేలకొరిగినా అవసరమైన సహాయక చర్యలన్నింటినీ హైడ్రా చేపట్టే బాధ్యతలను మున్సిపల్ శాఖ అప్పగించింది.
Also Read: ACB Raids: కాళేశ్వరం ఇంజనీర్కు బిగ్ షాక్.. రంగంలోకి ఏసీబీ.. 12 చోట్ల సోదాలు!
ఇతర శాఖలు హైడ్రాకు సహకరిస్తాయా?
అయితే, ఈ సహాయక చర్యలను జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుని చేపట్టాలని ఉత్తర్వుల్లో మున్సిపల్ శాఖ స్పష్టంగా పేర్కొనగా, ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నివారణలో ఒంటరిగానే వ్యవహరించిన హైడ్రా ఈ దిశగా సమన్వయం సమకూర్చుకుంటుందా? ఇతర శాఖలు హైడ్రాకు సహకరిస్తాయా? అన్నదే వేచి చూడాలి. దీనికి తోడు వర్షాకాల సహాయక చర్యలు ముగిసినానంతరం, పోస్ట్ మాన్సూన్ బాధ్యతలుగా నాలాల్లోని పూడికతీత పనులను కూడా వచ్చే జనవరి మాసంలో హైడ్రానే చేపట్టాల్సి ఉంది. ఈ పనులు చేపట్టే ఏళ్ల తరబడి అనుభవమున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీలో మాత్రమే ఉండగా, వీరు హైడ్రా చేపట్టే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారా? లేక హైడ్రా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను కాదని, వేరే కాంట్రాక్టర్లను టెండర్లకు ఆహ్వానిస్తుందా? హైడ్రా రేట్లకు జీహెచ్ఎంసీ యేతర కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకొస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.