MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. ఆమెను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కవిత ఆందోళనకు దిగిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత.. బస్ భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయట రహదారిపై ఆమె బైఠాయించారు. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ఆమెను అరెస్ట్ చేసి.. చంద్రాయణ గుట్టకు పోలీసులు తరలించారు.
అంతకుముందు ఆందోళనల సందర్భంగా కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యతో.. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతున్నట్లు చెప్పారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!
ఇదిలా ఉంటే బస్ పాస్ ఛార్జీలను పెంచుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ సోమవారం ప్రకటించింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదని, పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా పెంచాల్సిన పరిస్థితి తలెత్తినట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు పాస్ ధరలను 20శాతానికి పెంచింది. ఫలితంగా రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ.1,400కు.. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధర రూ.1,600కు.. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1,800కు పెరిగింది.