KCR: అనారోగ్యంతో అకాల మృతి చెందిన బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) పార్థివ దేహాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) సందర్శించారు. మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన కేసీఆర్, పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ భార్య, బిడ్డలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. కుమారుడు వాత్సల్య నాథ్ను దగ్గరికి తీసుకున్నారు. ఆ సమయంలో ఉద్వేగానికి గురైన కేసీఆర్ కళ్లు చెమర్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృదు స్వభావి, సౌమ్యుడు, ఆప్తుడుగా వున్న గోపీనాథ్ మరణం తీరని లోటని కేసీఆర్ అన్నారు.
పార్టీకి తీరని లోటు
అంతకుముందు, గోపీనాథ్ భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు తదితరులు ఉన్నారు. మాగంటి కుటుంబసభ్యులను కలిసిన నేతలు ఓదార్చారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. సోదరుడు, మృదు స్వభావి అయిన ఆయన మృతి చెందడం చాలా బాధాకరమని, మనం ఒక మంచి నాయకుడిని కోల్పోయామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో మాగంటి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఇటు, అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
Read Also- TG Cabinet: క్యాబినెట్ 2.0.. ప్రమాణం చేసిన ఆ ముగ్గురు
అమెరికా నుంచి రాగానే..
నిన్నటిదాకా అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్, వచ్చీ రాగానే శనివారం ఉదయం మాగంటి చికిత్స పొందిన ఆస్పత్రికి వెళ్లారు. కుటుంబసభ్యులను కలిసి ఆయన కోలుకుంటారని ధైర్యం చెప్పారు. కానీ, ఇంతలోనే విషాదం నెలకొంది. ఆదివారం మాగంటి మరణ వార్త తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు కేటీఆర్. అక్కడ శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు.
హరీశ్ రావు సంతాపం
మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao). ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో హరీశ్ పోస్ట్ పెట్టారు. తర్వాత గోపీనాథ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Read Also- Akhanda 2 : అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?