TPCC Mahesh Kumar Goud: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈటల వ్యాఖ్యలు చూశాక తనకు ఆశ్చర్యమేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ (KCR) తప్పేమి లేదని.. అంతా కేబినేట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల బుకాయించారని చెప్పారు. ఆర్ధిక మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధమే లేదని అనడం హాస్యాస్పదంగా ఉన్నారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కోడై కూసోందని గుర్తుచేశారు. కానీ ఈటల రాజేందర్ అందుకు భిన్నంగా ఈరోజు కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్ తో కుమ్కక్కైనట్లు స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరంలో ఈటలకు వాటాలు
కాళేశ్వరంలో ఈటలకు కూడా వాటాలు ముట్టాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే KCRకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ (KCR Family) అవినీతిపై పల్లెత్తు మాట కూడా విచారణ కమిషన్ ఎదుట చెప్పకపోవడం ఆశ్చర్యమేసిందని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఈటల ఇంకా బీఆర్ఎస్ (BRS) లోనే ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. పక్కా ప్రీ ప్లాన్ ప్రకారం కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao), ఈటల రాజేందర్ కూడబలుక్కుని ఒక్కటే సమాధానాలు చెప్పాలని నిర్ణయించినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈటల వ్యాఖ్యలతో ఆయన హరీశ్ రావుతో రహస్యంగా భేటీ అయ్యారని తాను చెప్పిన మాటలు నిజమని తేలిందని చెప్పారు.
Also Read: NEET PG 2025: నీట్ పరీక్షపై బిగ్ అప్డేట్.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు
బీజేపీ సమాధానం చెప్పాలి
కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకుంటున్న బీజేపీ నేతలు.. ఈటల మాటలకు ఏం సమాధానం ఇస్తారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం మేరకే కేసీఆర్ ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా? అని నిలదీశారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ తన పంథా మార్చుకుందా? ఈటల ఇచ్చిన వివరణ ఆయన సొంతమా? లేక బీజేపీ విధానమా? సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ చెబుతుంటే.. అసలు అవినీతే జరగలేదని మాట్లాడుతున్న ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీ ఉందా అంటూ నిలదీశారు.