BRS Vs Jagruthi: ఒకవైపు బీఆర్ఎస్ (BRS) పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు కవిత (Kavitha) తన సొంత సంస్థను, సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా అంశాల వారీగా పోరు బాట పట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలను గుర్తించినట్లు సమాచారం. వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టేందుకు సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి దీటుగా జాగృతి (Jagrithi) కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని, తను రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆమె అనుసరిస్తున్న విధానాలే స్పష్టం చేస్తున్నాయి. సామాజిక తెలంగాణే లక్ష్యంగా పావులు కదుపుతున్న కవిత, మరో 5 నూతన కమిటీలు వేసి ఆయా వర్గాల పక్షాన వారి హక్కుల కోసం పోరాటం చేయాలని భావిస్తున్నది.
జాగృతి బలోపేతంపై దృష్టి
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఇక బీఆర్ఎస్ వర్సెస్ జాగృతిగా మారనుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపైనా ఇప్పటికే నిలదీస్తూ వస్తుంది. జూన్ రెండో వారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలకు శ్రీకారం చుట్టబోతున్నది. మరోవైపు పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నది. దీనిని గ్రహించిన కవిత సైతం జాగృతి బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే జాగృతి మహిళా సమాఖ్య, యువజన, లీగల్ సెల్, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్లతో పాటు యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్ను కవిత నియమించారు. వీటితో పాటు మరో జాగృతి అనుబంధ కమిటీలను నియమించనున్నారు. ఈ సారి నూతనంగా మైనారిటీ హక్కుల కోసం ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు, జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పార్టీపై, కేసీఆర్పై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేపట్టనున్నారు. పార్టీ చేయాల్సిన కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకొని పార్టీ క్యాడర్కు దగ్గర కావడంతో పాటు ప్రజల అభిమానాన్ని చురగొనాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇప్పటికే 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 45 సెగ్మెంట్లలో పర్యటించారు. మిగిలిన వాటిలోనూ పర్యటించడంతో పాటు జాగృతి కమిటీలను వేయనున్నారు.
టార్గెట్ కేటీఆర్?
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కవిత ఇప్పటికే పరోక్షంగా విమర్శలకు పదును పెట్టింది. ఆశించిన మేర ప్రభుత్వంపై ఉద్యమం చేయడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం లేదని, కార్యాచరణ చేపట్టడంలో పార్టీ ఫెయిల్ అయిందని, సోషల్ మీడియాలో పోస్టులతో ఏం చేస్తారని కవిత ఆరోపణలు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారని పరోక్షంగా ఆరోపణలు చేసింది. తాజాగా జాగృతి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా కవిత మాట్లాడుతూ తాము పోరాటాలు చేస్తుంటే కొంతమంది ఓర్వడం లేదని పేర్కొన్నారు. అయితే, ఆమె చేస్తున్న పోరాటాలను కాంగ్రెస్, బీజేపీ నాయకులా లేకుంటే పార్టీ నాయకులపై పరోక్షంగా దెప్పిపొడిచిందా? అనేది చర్చకు దారితీసింది. ఆమె ఎవరిని టార్గెట్గా విమర్శలు చేస్తుందనేది పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది. కవిత కార్యాలయంలో జయశంకర్, కేసీఆర్ ఫొటోలు తప్ప పార్టీకి చెందిన ఎవరి ఫొటోలు పెట్టలేదు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీ బాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు పెట్టి వారికి సమూచిత స్థానం కల్పించారు.
Read Also- Rajiv Yuva Vikas Scheme: రాజీవ్ యువ వికాసం కోసం.. నెలకు 1500 కోట్లు..?
తెరపైకి కొత్తవాదం
‘కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే, మరో కన్ను జాగృతి’ అని కవిత తేల్చిచెప్పడం హాట్ టాపిక్ అయింది. నిన్నటివరకు కేసీఆర్ను తప్పా.. పార్టీ టార్గెట్గా విమర్శలు చేసింది. డాడీకి రాసిన లేఖను బయటపెట్టిన కోవర్టులు ఎవరో బయపెట్టాలని, చర్యలకు డిమాండ్ చేసింది. దీంతో పార్టీ సీరియస్గా దృష్టి సారించింది. ఆమెను ఎవరెవరు కలుస్తున్నారు? పార్టీ నేతలు ఎవరు వెళ్తున్నారు? మీడియా వారు ఎవరు కలుస్తున్నారు? అని పార్టీ ఇంటలిజెన్స్ ద్వారా ఆరా తీసింది. ఫీడ్ బ్యాక్ను కేసీఆర్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలోనే సడన్గా కవిత మాటమార్చడం వెనుక ఆంతర్యమేంటనే చర్చ మొదలైంది. కేసీఆర్ ఏమైనా చెప్పారా? పార్టీతో ఒప్పందం కుదిరిందా? వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ప్లాన్ ప్రకారం వారం రోజులుగా విమర్శలు, ఆరోపణలు చేశారా? అనేది హాట్ టాపిక్గా మారింది. మీడియా దృష్టిని ఆకర్షించి బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకే లేఖ లీకు చేశారా? అనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇంత హడావుడి చేశారా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి చర్చ జరుగుతున్నది.
నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని ఇక మేమే అధికారంలోకి వచ్చేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా, మరో పదేళ్లు అధికారం మాదే అని కాంగ్రెస్ పేర్కొంటుంది. ఈ తరుణంలో ఈ రెండుకాదు మళ్లీ మాదే అధికారం అంటూ బీఆర్ఎస్ నేతలు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు జాగృతి రెండు నిత్యం కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. జూన్ నెల రెండో వారం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధమవున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న మౌలిక సమస్యలపై పోరాట బాటపట్టనున్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటే పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా కవిత అనుసరిస్తున్న తీరు మాత్రం హాట్ టాపిక్ అయింది.
Read Also- Gold Rate ( 01-06-2025) : ఈ రోజూ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?