Jal Shakti Abhiyan: భవిష్యత్తులో నీటి కొరత రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలు రూపొందించాయి. జలాలు వృథాకాకుండా, వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2030 నాటికి ప్రతీ ఒక్కరికి పరిశుభ్రమైన నీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం జలశక్తి అభియాన్క్యాచ్ ద రెయిన్ (నీటి సంరక్షణ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్యాచ్ ది రెయిన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ అనే థీమ్తో ప్రచారం చేస్తుంది. భూగర్భ వర్షపునీరు వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు భూగర్భ జలాల పెంపు, నీటి కొరతను అధిగమించాలన్న లక్ష్యంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.
ఇందుకోసం నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో జలశక్తి అభియాన్(క్యాచ్ద రెన్)లో భాగంగా ఏడు రకాల పనులు చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో అన్ని రాష్ట్రాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెక్ డ్యామ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఆనికట్లు, కుంటలు, ఇంకుడుగుంతలు, ఇరిగేషన్ ట్యాంకులు, డీసిల్టింగ్ (పూడిక తొలగింపు), భూగర్భజలాల రీఛార్జ్, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా రీఛార్జ్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్, ఫామ్ పాండ్స్ ఇలా పనులు చేపట్టారు.
అన్ని శాఖలు జల వనరుల సంరక్షణ సంబంధించిన నిర్మాణాలు చేపట్టడంతోపాటు వాటి వివరాలు ఫొటోతో అప్లోడ్చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, 2024 ఏప్రిల్లో ఈ పనులు పూర్తి కావాలి. లేదా పనులు ప్రారంభమై ఉండాలని నిబంధన విధించింది. అంతకుముందు చేసిన పనులు పరిగణలోకి తీసుకోమని పేర్కొంది. ఈ నెల 31లోగా పనులు వివరాలు అప్లోడ్చేయాలని గడువు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం పనులు పర్యవేక్షణ, అందుకు సంబంధించిన వివరాలను అప్లోడ్చేయించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. దీంతో ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తున్నారు.
Also Read: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం బిగ్ అప్డేట్స్… పత్రాలు మంజూరు?
జన్ మన్ రేగాతో అక్షాంశాల గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ లో చేసిన పనుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం జన్ మన్ రేగా సాప్ట్వేర్ ను రూపొందించింది. ఈ సాప్ట్వేర్ తో చేసిన పనులకు సంబంధించి ఆక్షాంశాలు, రేఖాంక్షలు గుర్తిస్తుంది. పనులు జరిగాయో లేవో అనేది కూడా దీంతో తెలుసుకునే అవకాశం ఉంది. నిర్మాణాలు, కట్టడాలు స్పష్టంగా కనిపించకపోయినా, ఫొటోలు సైతం క్లారిటీ లేకపోయినా ఆన్లైన్లో నమోదు కాదు. మళ్లీ స్పష్టంగా కనిపించే ఫొటోతో అప్లోడ్చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలను అప్ లోడ్ను స్పీడ్ చేసినట్లు సమాచారం.
తెలంగాణ మూడోస్థానం
నీటి వనరుల సంరక్షణ, పొదుపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ వర్క్స్ చేపట్టారు? ఏ స్టేజీలో ఉన్నాయి? అసలు నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారా? లేదా అనేది తెలుసుకోవడంతోపాటు ఈ పనలు వివరాలను ఒకేచోట చేర్చేందుకు కేంద్రం ‘జలశక్తి అభియాన్’ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా శాఖలు నీటి సంరక్షణ సంబంధించి పనుల వివరాలు ఈ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకుడు గుంత, చెక్ డ్యామ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఫామ్పాండ్స్ నిర్మిస్తే వాటికి సంబంధించిన స్పష్టమైన ఫొటోతోపాటు రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
కేంద్రం విధించిన నిబంధనల్లో ఏడు రకాల పనుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని సూచించింది. ఆ నమోదులో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 3,01,600 పనులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం 3,95,005 పనుల వివరాలు నమోదు చేసి ఫస్ట్ స్థానంలో, రాజస్థాన్ 3,69,843 పనుల అప్లోడ్ చేసి మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 45,551 పనులతో వరంగల్ ప్రథమ స్థానం, నిర్మల్ 43,825 రెండో స్థానం, ఆదిలాబాద్38వేలు మూడోస్ధానం, నల్గొండ 24 వేల పనుల వివరాలు నమోదు చేసి నాలుగో స్ధానంలో నిలిచాయి.
రూ.2 కోట్లు నజరానా
కేంద్రం 2021 మార్చి 21న జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ద రెయిన్ ప్రొగ్రాంను ప్రారంభించింది. జలశక్తి అభియాన్లో భాగంగా నీటి పొదుపు, జల వనరుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించిన పనుల వివరాలు అప్లోడ్ చేసిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నజరానా ప్రకటించింది.బోర్వెల్ రీఛార్జ్, ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్స్ పలు రకాల పనులు చేపట్టిన జిల్లాలకు కేంద్రం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జిల్లాలకు రూ.2 కోట్లు.. ఆ తర్వాత స్థానంలో ఉన్న జిల్లాకు రూ.కోటి ప్రోత్సాహాకాలు అందిస్తుంది.
Also Read: Local Body election: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సర్కారు ప్రిపరేషన్ స్పీడప్!