Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ మరో ఘనతను సాధించింది. పోలీసింగ్ లో ఇప్పటికే దేశంలో అగ్రస్థానం…డ్రగ్స్ కు చెక్ పెట్టటంలో ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించిన మన పోలీసులు తాజాగా మరో రికార్డ్ సృష్టించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచారు. ఈ క్రమంలో నోడల్ ఆఫీసర్ గా ఉన్న సీఐడీ డీజీ షిఖా గోయల్ ను డీజీపీ జితేందర్ అభినందించారు. ఏయేటికాయేడు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ చోరీ కేసులు పెరిగిపోతుండటం…లక్షల మంది సెల్ ఫోన్లను పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాటిని రికవరీ చేయటానికి కేంద్రం 2022, సెప్టెంబర్ లో సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
టెలి కమ్యూనికేషన్స్ శాఖ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని అమలు చేశారు. ఆ తరువాత 2023, ఏప్రిల్ 19న తెలంగాణలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఐడీ డీజీ షిఖా గోయల్ దీనికి నోడల్ అధికారిగా ఉన్నారు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద ఆలస్యంగా ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన పోలీసులు సెల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించారు. సీఈఐఆర్ డ్యాష్ బోర్డు గణాంకాల ప్రకారం ఈనెల 19వ తేదీ వరకు కోట్ల రూపాయల విలువ చేసే 78,114 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోనే 30,963 సెల్ ఫోన్లను రికవరీ చేశారు.
Also Read: Army Jawan Suicide: ఆర్మీ యువ జవాన్ ఆత్మహత్య.. కన్నీటి సంద్రంగా మారిన స్వగ్రామం!
సిబ్బంది అంకితభావం…
ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ షిఖా గోయల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించటం వల్లనే ఈ ఘనతను సాధించగలిగినట్టు చెప్పారు. ప్రతీ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయటం, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించటం, చోరీ అయిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు యాక్టివేట్ కాగానే వాటికి ఫోన్లు చేసి మాట్లాడటం వంటి చర్యలు తీసుకోవటం వల్ల రికార్డు సృష్టించగలిగినట్టు తెలిపారు.
టెలికాం శాఖ సమన్వయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్ దీంట్లో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ చోరీ అయినా, పోయినా వెంటనే www.tspolice.gov.in లేదా www.ceir.gov.in అన్న వెబ్ సైట్లకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ల రికవరీలో విశేషంగా కృషి చేసిన సైబర్ క్రైం ఎస్పీ గంగారాం, డీడీజీ సెక్యూరిటీ హేమంత్ రత్వే, సెక్యూరిటీ డైరెక్టర్ నిఖిత, జేటీవో నంబి మృదుపాణిలను అభినందించారు.
Also Read: Notices to KCR: కాళేశ్వరం కమిషన్ దూకుడు.. కేసీఆర్కు నోటీసులు.. విచారణకు వెళ్తారా?