Swetcha Effect: పాతబస్తీ చార్మినార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి ఏకంగా 17 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీ విషయంలో ప్రజలు, అధికారులు, పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ స్వేచ్ఛ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీంతో కదిలిన హైడ్రా యంత్రాంగం.. ఫైర్ సేఫ్టీ విషయంలో మార్పులు దిశగా అడుగులు ప్రారంభించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం.. స్వేచ్ఛ వరుస కథనాలతో స్పందించింది. ఈ మేరకు అగ్ని ప్రమాద ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (RV Karnan), హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి (Anudeep Durishetty), హైదరాబాద్ సీపీ సి.వి ఆనంద్ (C.V. Anand), ఫైర్ డీజీ నాగిరెడ్డి (Nagi Reddy), హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Ranganath), TSSPDCL సీఎండీ ముషారఫ్ లకు చోటు కల్పించారు.
సీఎంకు ప్రతిపాదనలు
ఈ నెల 18న జరిగిన గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం (Gulzar House Fire Accident) ఈ కమిటీ సమగ్ర విచారణ జరపనుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రమాదానికి దారి తీసిన అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది. ఈ ఘటనకు గల కారణాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు. అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సమగ్ర నివేదికను ఈ కమిటీ ఇవ్వనుంది. ఘటనకు సంబంధించిన కారణాలతో పాటు భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సైతం కమిటీ చేయనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఉన్నాధికారులతో చర్చించి చర్యలు తీసుకోనున్నారు.
Also Read: Raj Bhavan Theft: రాజ్ భవన్ చోరీ కేసులో భారీ ట్విస్ట్.. ఈ దొంగ మామూలోడు కాదు భయ్యా!
క్లూస్ టీమ్ పరిశీలన
మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన భవనం వద్దకు క్లూస్ టీమ్ చేరుకుంది. చార్మినార్ గుల్జార్ హౌస్ లోని అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో వివరాలు సేకరిస్తోంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సైతం ఈ భవనాన్ని పరిశీలించే అవకాశముంది. దీంతో భవనం వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.