Bandi sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో జమ్మూ కశ్మీర్ లోని యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయి ఆందోళనకు గురవుతున్న తెలుగు విద్యార్థులను జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది.
తెలంగాణ, ఏపీకి చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు కశ్మీర్ యుద్ధ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్ లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎస్ కేయూఏఎస్ టీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 23 మంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
కొద్ది రోజులుగా పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో, క్షిపణులతో కశ్మీర్ లోని ప్రజలు నివసిస్తున్న ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు అక్కడి ఎయిర్ పోర్టులు మూసివేయడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు.
Also read: Hyderabad: సీబీఐ వలలో ఇన్ కమ్ టాక్స్ కమీషనర్.. ఏకంగా 70 లక్షలు లంచం తీసుకుంటూ..
ఈ నేపథ్యంలో తమ దుస్థితిని వివరిస్తూ 23 మంది తెలుగు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాశారు. తాము యుద్ధ ప్రాంతంలో చిక్కుకుని ఉన్నామని, తాము చదువుకునే విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితి వేగంగా దిగజారిపోతోందని లేఖ ద్వారా వివరించారు. పరిస్థితి భయానకంగా ఉందని, విమాన సేవలు నిలిపివేయడంతో తాము జమ్మూ కశ్మీర్ నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని పేర్కొన్నారు.
ఈ ప్రాంతం నుంచి తమను తక్షణమే తరలించి ఆదుకోవాలని బండిని అభ్యర్థించారు. కాగా ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత కలెక్టర్, ఎస్ కేయూఏఎస్ టీ వర్శిటీ డీన్ తో మాట్లాడి తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. కేంద్ర మంత్రి సూచనతో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది.