Jawan Murali Naik: పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్, పాక్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో? తెలియని పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూగానే సాగుతోంది. ఈ దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. అయితే ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు సైతం కన్నుమూశారు. కాగా, కశ్మీర్లో పాక్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. మురళీది ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండా. మురళీ నాయక్ భౌతికకాయం శనివారం స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల కిందట ఆర్మీలో చేరిన మురళీ.. నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులతో మురళీ వీడియో కాల్ చేసి మాట్లాడారు. వచ్చే వారంలో సెలవు మీద ఇంటికి రావాల్సి ఉంది. ఇంతలోనే గురువారం అర్ధరాత్రి కాల్పుల్లో చనిపోయినట్టు మురళీ కన్నుమూశారు. మురళీ నాయక్ వీరమరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు మంత్రి సవిత కల్లి తండాకు వెళ్లి జవాను తల్లిదండ్రులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును మురళీ తల్లిదండ్రులకు మంత్రి అందజేశారు.
సీఎం చంద్రబాబు : దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్కు నివాళులు అర్పిస్తున్నాను.
నారా లోకేష్ : ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం.
పురందేశ్వరి : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్కు నివాళులు. మాతృ భూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళి నాయక్ సేవలు దేశం మరువదు. దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావు. మీరు అమరులైన మా స్మృతిలో సజీవులే. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
వైఎస్ జగన్ : దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేం. మురళీనాయక్ కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ సందర్భంగా మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు.
వైఎస్ షర్మిల : శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళి నాయక్ యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. దేశం కోసం మురళి నాయక్ వీర మరణం పొందారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, మురళి నాయక్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను.