Patnam Mahender Reddy: గ్రామీణ ప్రాంతాల్లో పాలనా పరంగా ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు గౌరవ అధ్యక్షుడు సందీప్ తదితరులు గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నిర్వహించే రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల సదస్సుకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. గతంలో వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కోసం మంత్రిగా మహేందర్ రెడ్డి సహకరించిన సమయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం తమకున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు మరో మారు సహకరించాలని వారు మహేందర్ రెడ్డిని కోరారు.
Also read: Nara Lokesh: ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా ఏపీ.. నారా లోకేష్ జైత్రయాత్ర!
జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి గా క్రమబద్ధీకరించబడిన వారరు సర్వీస్ లో ఏడాది సేవా కాలం పూర్తయినందున ప్రభావిత తేదీని ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుల దృష్టికి తీసుకెళ్లాలని వారు మహేందర్ రెడ్డిని కోరారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి, సామాజిక తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేయరాదని వారు కోరారు. క్రీడా కోటాలో ఎంపికైన 98 మంది జిపిఎస్ లను తొలగించిన నేపథ్యంలో వారిని సర్వీసులు తీసుకొని క్రమబద్ధీకరణ చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.
వారి సమస్యలను విన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. చీఫ్ విప్ ను కలిసిన వారిలో పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవిశెట్టి, ప్రధాన కార్యదర్శి సంజీవ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు సుధాకర్ తదితరులు ఉన్నారు.