RTC Strike: మే 7 నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు ముందు మే 5న ఆర్టీసి కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తామని తెలిపింది. ఆర్టీసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసి యూనిఫారంలో కార్మికులంతా ఈ కవాతులో పాల్గొంటారన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీరౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో సమ్మె చేయాలని నిర్ణయించింది. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి సూచించారు.
అయితే కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని చెప్పి.. మళ్లీ యాజమాన్యంతో మద్దతుగా తమతో కలవడం లేదన్నారు. యూనియన్లకు అతీతంగా అందరు సమ్మెకు కలిసి రావాలి పిలుపు నిచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంత చేయాలంటూ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
Also read: Special Clinics: వృద్ధులకు గుడ్న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్లినిక్లు!
సమ్మె తొందరపాటు నిర్ణయం కాదని, గత 6 నెలల నుంచి జేఏసీ దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేసుకుంటూ డిసెంబర్ 5న పెద్ద యెత్తున ‘‘ఛలో బస్ భవన్’’ కార్యక్రమం చేపట్టి కార్మికులందరినీ సమ్మెకు సమాయత్తం చేసేందుకు జేఎసి నాయకత్వం అన్ని జిల్లాలలో పర్యటించి, డిపోలలో గేట్ మీటింగులు నిర్వహించి, కార్మికులకు భరోసా కల్పించి సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు.
గతంలో జేఎసిలో భాగస్వామ్యం కావాలని అన్ని కార్మిక సంఘాలకు 4 సార్లు లేఖలు వ్రాసి పిలిచినప్పటికీ వివిధ కారణాలు చూపి జేఏసీ లోకి కలిసి రాలేదని, ఇప్పుడు జేఏసీ సమ్మె నోటీసిచ్చి పలుమార్లు అన్ని సంఘాలను సమ్మె నోటీసులు ఇవ్వాలని కోరినప్పటికీ నేటికీ సమ్మె నోటీసు ఇవ్వకుండా, జేఏసీపై నిందలు వేయడం తగదని అన్నారు.
సమ్మె తేది ప్రకటించిన తరువాత యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె డిమాండ్ల నోటీసులు ఇచ్చిన తరువాత రెండు సార్లు లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరిగిన తరువాత మళ్ళీ మొదటి నుండి కార్యాచరణ మొదలుపెట్టాలని అర్థం లేని విధంగా కోరడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు మే 7 న జరుగు సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరారు.