తెలంగాణ: practicing doctors: ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే మత్తు పదార్థాలకు బానిసలైతే ఈ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అయితే, ఇదే జరుగుతోంది. కొంతకాలం క్రితం నార్కొటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన ఓ హాష్ ఆయిల్ పెడ్లర్ ను జరిపిన విచారణలో దిగ్ర్భాంతికరమైన ఈ విషయం వెలుగు చూసింది. వైద్యలుగా ప్రాక్టీస్ చేస్తున్న వారితోపాటు మెడికల్ స్టూడెంట్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పలువురు నిషా కోసం ఈ హాష్ ఆయిల్ ను వాడుతున్నట్టుగా తెలిసింది.
గంజాయి ఆకులను ఆల్కహాల్ తో కలిపి మరిగించటం ద్వారా ఈ హాష్ ఆయిల్ ను తయారు చేస్తారు. ఇటీవల రాచకొండ పోలీసులు ఓ గ్యాంగును అరెస్ట్ చేసి 80 లక్షల రూపాయల విలువ చేసే హాష్ ఆయిల్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వివరాలు వెల్లడిస్తూ కిలో హాష్ ఆయిల్ తయారు చేయటానికి 40 నుంచి 50 కిలోల గంజాయి అవసరమవుతుందని చెప్పటం గమనార్హం.
నార్కొటిక్ బ్యూరోకు చెందిన ఓ అధికారి చెప్పిన ప్రకారం నలుపు రంగులో చిక్కగా ఉండే ఈ హాష్ ఆయిల్ ను రెండు మిల్లీ లీటర్లు తీసుకున్నా కనీసం ఎనిమిది గంటలపాటు సేవించిన వ్యక్తి మత్తులో ఉంటాడు. గతంలో సైదాబాద్ పోలీసులతో కలిసి ఓ పెడ్లర్ ను అరెస్ట్ చేసినపుడు అతని కస్టమర్ల లిస్టులో పలువురు డాక్టర్లతోపాటు మెడికోలు, సాఫ్ట్ వేర్, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టుగా వెల్లడైందన్నారు.
Also Read: Maoists in Karregutta: కర్రెగుట్ట ప్రాంత గ్రామాల్లో టెన్షన్ టెన్షన్.. హిడ్మా, దేవా లే టార్గెట్!
కొంతమంది దీనిని చాయ్ లో కలిపి తీసుకుంటుంటే మరికొందరు సిగరెట్లలోని పొగాకును బయటకు తీసి దాంట్లో రెండు మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్ కలిపి తిరిగి సిగరెట్లలో నింపి సేవిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. ఇంకొందరు నీళ్లను బాగా మరిగించి ఆ తరువాత దాంట్లో హాష్ ఆయిల్ కలిపి దాని ఆవిరిని పీలుస్తున్నట్టు వెల్లడైందని చెప్పారు. కిలో నూనెను లక్ష నుంచి లక్షా 20 వేల రూపాయలకు కొంటున్న పెడ్లర్లు అయిదు మిల్లీ లీటర్ల చొప్పున చిన్న చిన్న సీసాల్లో నింపి ఒక్కో సీసాను 3 వేల నుంచి 4వేల రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. ఈ మాదకద్రవ్యం ఎక్కువగా విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి వస్తోందని చెప్పారు.
వంద కిలోల గంజాయి తీసుకు రావటంకన్నా నాలుగైదు కిలోల హాష్ ఆయిల్ ను తీసుకు రావటం సులభం కాబట్టి దీనిని స్మగుల్ చేసి ఇక్కడకు తెస్తూ అమ్ముతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. ఇక, హాష్ ఆయిల్ మత్తులో ఉన్న సమయంలో దానిని తీసుకున్న వ్యక్తికి స్వీయ నియంత్రణ ఉండదని సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. హాష్ తీసుకున్న వారు హలోషన్ లోకి వెళ్లిపోతారని వేగంగా స్పందించ లేరన్నారు.
దీనికి కారణం హాష్ ఆయిల్ ప్రభావం చిన్న మెదడుపై తీవ్రంగా ఉండటమే అని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మత్తుకు అలవాటు పడ్డ డాక్టర్లు రోగులను చూడటమంటే వారి ప్రాణాలతో చెలగాటాలాడినట్టే అని చెప్పారు. ఇక, హాష్ ఆయిల్ ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. దీనిని తీసుకోవటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుందని చెబుతూ దీనిల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఊపిరితిత్తులపై కనబరిచే ప్రభావం వల్ల ఊపిరి తీసుకోవటం కష్టమవుతుందని వివరించారు. ఈ మత్తు పదార్థాన్ని సేవించిన వారిలో యాంగ్జయిటీ కూడా పెరిగిపోతుందని చెప్పారు. కొన్నిసార్లు మత్తులో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయన్నారు.