Sampath Nandi: మిల్కీ బ్యూటీ తమన్నా నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్పై డి మధు నిర్మించారు. ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఒకవైపు థియేటర్లలో ప్రేక్షకులు లేకపోయినా, ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది అంటూ డివైన్ సక్సెస్ మీట్ను నిర్వహించింది టీమ్. ఆల్రెడీ విడుదలైన రోజు కూడా మీడియా సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ క్రమంలో డివైన్ సక్సెస్ మీట్లో సంపత్ నంది మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే కళ్యాణ్ రామ్, విజయశాంతిల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా కూడా మిక్స్డ్ స్పందనను రాబట్టుకుంది. ఈ సినిమా టీమ్ కూడా ఇప్పటికే రెండు సక్సెస్ మీట్లను నిర్వహించింది. మరో మూడు రోజుల్లో బ్రేకీవెన్ అయిపోతుందని స్వయంగా హీరో కళ్యాణ్ రామ్ ప్రకటించారు. ఇప్పుడు సంపత నంది అయితే మా ‘ఓదెల 2’ చిత్రం విడుదలకు ముందే బ్రేకీవెన్ అయిందని, ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి మాకు దేవుడి ప్రసాదమే అంటూ ప్రకటించారు. దీంతో ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. అసలే జనాల్లో థియేటర్లకు రాకపోతుంటే వీళ్లకు బ్రేకీవెన్ ఎలా అయింది? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా, అసలెవరు తగ్గడం లేదుగా! అంటూ రెండు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓదెల 2’ డివైన్ సక్సెస్ మీట్లో సంపత్ నంది ఏం మాట్లాడారంటే..
Also Read- Dragon: ‘ఎన్టీఆర్ నీల్’ కోసం ‘డ్రాగన్’ బయలుదేరింది.. ఫొటోలు వైరల్!
‘‘ఏడాదిన్నర క్రితం ‘ఓదెల 2’ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఏదో జరిగింది. ఏదో శక్తి మిమ్మల్ని నడిపించింది. ఏదీ మేము ప్లాన్ చేసింది కాదు. దానంతట అదే జరిగిపోయింది. ఆ పరమ శివుడు లేకుండా ఈ సినిమా ఐడియా లేదు. ఈ సినిమా ఐడియా చెప్పగానే నిర్మాత మధు, ఖర్చుకు వెనకాడకుండా చేద్దామన్నారు. అజనీష్ ఇచ్చిన మ్యూజిక్కి గూస్బంప్స్ వచ్చాయి. డీఓపీ సౌందర్ రాజన్తో పదేళ్ల నుంచి పని చేస్తున్నా. ఆయన లేకుండా ఏ సినిమా చేయలేదు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ చాలా అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. ఎడిటర్ అవినాష్ ‘వాన’ పాట కట్ నుంచి నాకు తెలుసు. అలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్కు పేరు పేరునా థ్యాంక్స్. ‘ఓదెల-2’ అనుకోగానే తమన్నానే అనుకున్నాం. 20 ఏళ్ల తన కెరీర్ ఒకవైపు.. ఇందులో ఆమె పాత్ర ఇంకోవైపు అని చెబుతున్నారు. దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకు, ఆమె టీమ్కు థ్యాంక్స్. వశిష్ట నన్ను ఫ్యామిలీ అనుకుంటారు. ఆయన ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో తెలీదు కానీ.. ఈ సినిమా తర్వాత ఆయనకు అద్భుతమైన పాత్రలు వస్తాయి. తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం. సమాధి శిక్ష సీన్స్ అంత బాగా పండడానికి కారణం గగన్. ప్రభావతికి నేను ఫ్యాన్. ఆమె లేకుండా సినిమాలు చేయను. ఆమెకు చెప్పాల్సిన పని లేకుండా పాత్రకు న్యాయం చేస్తారు. మిగతా ఆర్టిస్టులంతా వాళ్ల పాత్రలకు చక్కగా న్యాయం చేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడూ ఒక మాట అనేవారు. ‘మనం ఎదిగామని మనమే చెప్పుకోవాలి. మన గురించి ఎవరూ చెప్పరు’ అనే అనేవారు. ఇప్పటి వరకు ఎప్పుడూ నేను నా గురించి ఎక్కడా చెప్పుకోలేదు. ఈ సినిమా గురించి మాత్రం నేను చెప్పదలచుకున్నాను. నాకు నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు భక్తిభావం పెద్దగా లేదు. కష్టపడితేనే ప్రతిఫలం వస్తుందని నమ్మేవాడిని. అలాంటి నేను, ఈ సినిమా కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడని భావిస్తున్నాను. ఇది నాకు సాధ్యమయ్యే కథ కాదు. ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకుని రాశాను. నంది, శివుడు కనిపించినప్పుడు ప్రేక్షకులు ఫీల్ అయిన దాన్ని నాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరి వాళ్లు ఫోన్ చేసి ‘ప్రౌడ్ ఆఫ్ ఓదెల’ అని అంటుంటే అద్భుతంగా భావిస్తున్నా. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోయే సినిమా.
Also Read- Kavya Kalyanram: బ్లాక్ శారీలో కనిపించి కుర్రాళ్ళను.. టెంప్ట్ చేస్తున్న బలగం బ్యూటీ కావ్య
మనం ఏ జోనర్ సినిమా చేసినా వంద పోలికలు ఉంటాయి. పోలిక లేకుండా సినిమా ఉండదని నేను చెప్పను. కానీ ఇందులో సమాధి శిక్ష, సైకిల్, తిరుపతి, క్లైమాక్స్లో ఉన్న 20 నిమిషాల గురించి అందరూ స్పెషల్గా మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. వీటిని అందరూ స్ప్రెడ్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. సినిమాలో ఉన్న మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఈ సినిమా బడ్జెట్ మీరు అనుకుంటున్న బడ్జెట్ కాదు. రిలీజ్కు ముందే ఈ సినిమా బ్రేకీవెన్ అయింది. మాకు ప్రేక్షకుల రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పరమాత్ముడు ప్రసాదించిన ప్రసాదంగా భావిస్తాం. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ బాటలో వెళ్తోంది. అందుకు ముఖ్య కారణం సీజీ కూడా. చాలా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సీజీ చేశారు ప్రసాద్ ల్యాబ్స్ వాళ్లు. సినిమా చూడని వాళ్లు తప్పకుండా థియేటర్కు వెళ్లి చూస్తారని, ఆ పరమశివుడిని దర్శించుకుని ధన్యులవుతారని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు