YS Sharmila on Modi: ఏపీకి ప్రధాని మోడీ మే 2న రానున్నారు. మోడీ రాక ఏర్పాట్లలో ప్రభుత్వం ఉండిపోయింది. కానీ ఈ మహిళా నేత మాత్రం తన విమర్శలకు పదునుపెట్టి మరీ ట్వీట్ సాగిస్తున్నారు. అంతేకాదు మాజీ సీఎం జగన్, మోడీకి దత్తపుత్రుడని తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, ప్రభుత్వంపై సైతం కామెంట్స్ చేసి విరుచుకుపడ్డారు. ఇంతకు ఆ మహిళా నేత ఎవరో కాదు వైఎస్ షర్మిల.
ప్రధాని మోడీ పర్యటన ఖరారు కావడంతో, వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆధారంగా.. చెంబేడు నీళ్ళు, గుప్పెడు మట్టి ఇదే అమరావతికి ప్రధాని మోడీ చేసిన సహాయమన్నారు. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారని విమర్శించారు. చివరికి ఆత్మగౌరవం అమరావతిని మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ కింద మార్చేశారన్నారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని, రాష్ట్రానికి చేసింది ద్రోహమన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు.
నిజంగా అమరావతిపై మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా ? ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా ? త్రీడీ గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా ? గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా ? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు అంటూ జగన్ లక్ష్యంగా ఆమె విమర్శించారు.
అమరావతి రైతుల ఉద్యమం ఢిల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు ? ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి A1 మోడీ, A2 చంద్రబాబు, A3 జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: GPS-based Toll System: వాహనదారులకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ డేట్ వచ్చేసింది..
వచ్చే నెల 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీని ఏపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలో ఒకటి. కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు SAILలో విలీనంతో పాటు, కడప స్టీల్,వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై కేంద్రం వైఖరి తేల్చాలన్నారు. పోలవరం ఎత్తు 45 మీటర్లా ? లేక 41 మీటర్లకే పరిమితమా ? మోడీ క్లారిటీ ఇవ్వాలన్నారు.