Protest Against PM Modi: నేషనల్ హెరాల్డ్ (National Herald case) కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఛార్జ్ షీట్ లో ఈడీ (Enforcement Directorate) చేర్చడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు సైతం దిగారు. ఈ క్రమంలో మాట్లాడిన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan).. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Modi Govt)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కక్ష రాజకీయాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కక్షరాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిస్తామని పార్లమెంటు సాక్షిగా మోదీకి రాహుల్ చెప్పారని గుర్తు చేశారు. అప్పటి నుంచి మోదీ సర్కార్ ప్రతీకార రాజకీయాలకు తెరతీసిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్న ఆమె.. భవిష్యత్ తరాలకు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతున్నట్లు చెప్పారు. మహా కుంభమేళా సమయంలోనూ వివక్ష చూపించారని మండిపడ్డారు. పేద ప్రజల పక్షాన కేంద్రాన్ని నిలదీస్తే ఈడీ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు
ఆర్థిక లావాదేవీలే జరగలేదు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపిందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గుర్తుచేశారు. ఇది దేశం మెుత్తం జరగాలని రాహుల్ గాంధీ కోరుతున్నట్లు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు లావా దేవీలే జరగలేదన్న ఆమె.. అలాంటప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ నాన్ ప్రొఫిట్ సంస్థ అన్న ఆమె.. ఈ విషయం ఆ సంస్థ బైలాస్ లోనే ఉందని తెలిపారు. మరోవైపు ట్రంప్ వైఖరితో దేశానికి నష్టం జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు.
బీజేపీ ఫాసిస్టు పాలన
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సైతం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ చూసి ఓర్వలేకనే మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఈ నిజాలు తెలియాలనే ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయిన నేషనల్ హెరాల్డ్ కు రూ. 90 కోట్లు రుణం ఇస్తే మనీలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read: Tirumala Goshala controversy: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఏం జరిగిందంటే?
అమిత్ షాది వెన్నుపోటు గుణం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సైతం కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీలది క్షమాగుణం అయితే.. మోదీ, అమిత్ షాలది వెన్నుపోటు గుణమంటూ ఆరోపించారు. ఈడీని అడ్డం పెట్టుకుని సోనియా, రాహుల్ గాంధీని బీజేపీ ఇబ్బంది పెడుతోందని అన్నారు. పదవుల కోసం బీజేపీ నేతల కుట్రలు చేస్తారన్న జగ్గారెడ్డి.. అద్వానీ దయతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీలకు యావత్ భారత్ అండగా ఉందని స్పష్టం చేశారు.