Nara Lokesh about Bandi Sanjay: గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఉప్పు నిప్పులా తయారయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉన్న రాజకీయ నేతలు.. ప్రస్తుతం పరస్పర ఆరోపణలతో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత (Kalvakuntla Kavitha) చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పక్క రాష్ట్రం గురించి నేతలు మాట్లాడితే ఇక విమర్శలే ఉంటాయన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ (Nara Lokesh) ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
లోకేష్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలకు చెందిన పలువురు విద్యార్థి, విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టాపర్లతో ప్రత్యేక భేటి నిర్వహించారు. ‘షైనింగ్ స్టార్స్’ (Shining Stars) పేరిట వారిని సన్మానించారు. అనంతరం నిర్వహించిన చిట్ చాట్ లో ఓ యువతి తాను ఐపీఎస్ కావాలని గోల్ పెట్టుకోవడంపై లోకేష్ స్పందించారు. ‘ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టవద్దు తల్లీ’ అంటూ లోకేష్ చమత్కరించారు. ఇప్పటికే తనపైన 23 కేసులు ఉన్నాయన్న లోకేష్.. మీరు మళ్లీ పెడితే బండి సంజయ్ అన్నతో పోటీ పడాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పై 109 కేసులు ఉన్నట్లు లోకేష్ గుర్తు చేశారు. బండి సంజయ్ ప్రస్తావన తీసుకొచ్చి మంత్రి నారా లోకేష్ సరాదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నిజంగానే అన్ని కేసులు ఉన్నాయా?
బీజేపీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతల్లో బండి సంజయ్ ఒకరు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. అప్పట్లో సీఎం కేసీఆర్ (KCR) కు వ్యతిరేకంగా ఉద్యమించారు. గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎండగడుతూ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (Praja Sangrama Yathra) చేశారు. ఈ యాత్ర సమయంలో అప్పటి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో తనపై పెద్ద ఎత్తున పోలీసు కేసు సైతం పెట్టినట్లు ఆయన ఆరోపించారు. 2023 నవంబర్ లో కరీంనగర్ లో నిర్వహించిన యాత్రలో బండి సంజయ్ స్వయంగా తనపై నమోదైన కేసులను వెల్లడించారు. అప్పట్లోనే తనపై 74 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 7 సార్లు జైలుకు వెళ్లానని లాఠీ దెబ్బలు సైతం తిన్నట్లు చెప్పారు. తాజాగా నారా లోకేష్ బండి కేసులు విషయాలను ప్రస్తావిస్తూ 109 ఉన్నట్లు గుర్తు చేశారు. ఆ లెక్కన చూస్తే బండిపై నమోదైన కేసుల సంఖ్య 2023తో పోలిస్తే 2025 నాటికి గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతోంది.
Also Read: AP Interesting Facts: దేశానికి ఏపీ ఇంత చేస్తోందా? ఆంధ్రులు మీసం మెలి వేయాల్సిందే!
విభేదాలు తొలగినట్లే..!
ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) కు బండి సంజయ్ లకు అసలు పడట్లేదని గత కొన్ని రోజులుగా తెగ ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా రాజా సింగ్ ను బండి సంజయ్ కలిశారు. తద్వారా వారి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజా సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయకుడు రాజాసింగ్ అంటూ ఆకాశానికెత్తారు. 2018 నుంచి బీజేపీ నుంచి గెలుస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ అంటూ అభినందించారు. దీంతో ఇరువురు నేతల మధ్య విభేదాలు తొలగినట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు కార్యకర్తలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.