Central Panchayati Awards: రాష్ట్రంలో స్పెషల్ పంచాయతీలుగా మాల్, మేడిపల్లి గ్రామాలుగా గుర్తించినట్లు కేంద్రానికి ప్రపోజల్ పంపించారు. వీటితో పాటు కొన్ని గ్రామాల వివరాలను సైతం పంపినట్లు తెలిసింది. అయితే ఎన్ని అవార్డులు రాష్ట్రానికి వరిస్తాయన్నది ఆసక్తి కరంగా మారింది. పంచాయతీడే రోజున కేంద్రం అవార్డులను అందజేయనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామపంచాయతీలను శక్తీకరణ అవార్డు, గ్రామ సభలను రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ అవార్డులతో సత్కరిస్తుంది.పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు ఏర్పాటు, విద్యుత్, విద్య-ఆరోగ్య-సామాజిక కార్యక్రమాలు, హరితహారం, మౌలికసదుపాయాల కల్పన, గ్రామ సభల నిర్వహణ వంటి 8 అంశాలను పరిశీలనలోకి తీసుకొని ఈ అవార్డులను ఎంపికచేస్తుంది.
అయితే కేంద్రం అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించగా 12 రాష్ట్రాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. అందులో తెలంగాణ నుంచి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రెండు గ్రామాలను ప్రత్యేక పంచాయతీలు గా గుర్తించి కేంద్రానికి ప్రపోజల్స్ పంపించారు. గతంలో పంచాయతీల్లో 9 విభాగాల్లో అవార్డ్స్ ఇచ్చేవారని, కానీ, ఈ సారి మాత్రం కేవలం మూడు విభాగాల్లో మాత్రమే ఈ అవార్డులు అందజేయనున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం మాల్ గ్రామం, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడిపల్లి గ్రామాలను స్పెషల్ కేటగిరీ కింద కేంద్రానికి అధికారులు ప్రపోజల్స్ పంపించారు. మాల్ గ్రామంలో ఆత్మ నిర్భర్ కింద ప్రపోజల్స్ పంపించినట్లు తెలిసింది. మేడిపల్లి గ్రామాన్ని క్లైమెట్ యాక్షన్, సోలార్ ఎనర్జీ పవర్ కింద ప్రతిపాదనలు పంపించారు.
మూడో కేటగిరీలో ఎడ్యుకేషనల్స్ ఇనిస్టిట్యూషన్ (గ్రామీణ టైనింగ్ సెంటర్స్ ) గ్రామాన్ని ఎంపిక చేయాల్సి ఉండగా… రాష్ట్రం నుంచి రెండు కేటగిరీల నుంచి ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీ నుంచి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి ఈ రెండు గ్రామాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19న దేశవ్యాప్తంగా గ్రామాలను ఎంపిక స్పెషల్ పంచాయతీల జాబితాను ప్రకటించనున్నది. ఈ నెల 24వ తేదీన పంచాయతీ డే పురస్కరించుకుని అవార్డులును పీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు.
గతంలో కేంద్రం 9 విభాగాల్లో అవార్డులు అందించేది. పంచాయతీలతోపాటు మండలాలు, జిల్లా పరిషత్ లకు ఈ అవార్డులు అందజేసేది. కానీ, ఈ సంవత్సరం కేవలం పంచాయతీలకు మాత్రం అవార్డులు అందజేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మూడు విభాగాల్లో మూడు కేటగిరీలుగా నిధులు కేటాయించనున్నది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరి వారీగా నిధులు కేటాయిస్తారు. ఫస్ట్ కేటగిరి అవార్డుకు రూ.కోటి, సెకండ్ కేటగిరీలో రూ.75 లక్షలు, థర్డ్ కేటగిరిలో రూ.50 లక్షలు అందజేస్తారు. అయితే రాష్ట్రం నుంచి మరో 42 గ్రామాల వివరాలను సైతం అధికారులకు కేంద్రానికి పంపినట్లు సమాచారం. అయితే ఎన్నిగ్రామాలకు అవార్డులు వరించనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.