CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ ఓవర్ వెయిట్ కారణంగా ఒక్కసారిగా కిందకు కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తీశారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం సృష్టించిన ఈ సంఘటన శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజా సంక్షేమం దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసేందుకు ఆ పార్టీ మంగళవారం నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రెండో అంతస్తుకు వెళ్లటానికి లిఫ్ట్ ఎక్కారు.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఇకపై సీఎం కనుసన్నల్లో ప్రజావాణి.. కష్టాలు తీరినట్లే!
అయితే, ఎనిమిది మంది మాత్రమే లిఫ్టులో ఎక్కాల్సి ఉండగా మొత్తం 13మంది దాని లోపలికి వెళ్లారు. దాంతో పైకి వెళ్లాల్సిన లిఫ్ట్ పెద్దగా శబ్ధం చేస్తూ ఒక్కసారిగా కిందకు కుంగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది హోటల్ వర్గాలకు సమాచారం అందించారు. అనంతరం హోటల్ సిబ్బంది సహకారంతో లిఫ్ట్ డోర్ తెరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మిగితా వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరో లిఫ్టులో రెండో అంతస్తుకు వెళ్లారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు