Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్టు పనులు 71శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మంగళవారం భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.
2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలో భోగాపురం ఎయిర్పోర్టు ఒక్కటే అతి అధునాతనమైనదని తెలిపారు. ‘ ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళానిలయం ఏర్పాటు చేస్తున్నాం. ఎయిర్ పోర్టు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి.
Also read: RBI Monetary Policy 2025: సామాన్యులకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!
మట్టి పనులు 100శాతం, రన్వే పనులు 97 శాతం, టాక్సీ వే పనులు 92 శాతం, రూఫింగ్ పనులు 60 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి కేవలం 9 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23 శాతం నుంచి 71 వరకు పూర్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్గా మారనుంది.
ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుంది. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.