చెన్నై స్వేచ్ఛ: Jamili Elections: తదుపరి లోక్సభ ఎలక్షన్ నుంచి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారంటూ కొంతకాలంగా వెలువడుతున్న ఊహాగానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2034 తర్వాత దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ తోసిపుచ్చారు. జమిలి ఎన్నికలకు ప్రస్తుతం పునాది మాత్రమే పడిందని ఆమె వ్యాఖ్యానించారు.
2024 లోక్సభ ఎన్నికల కోసం సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని, జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వస్తే ఎన్నికల భారీ ఖర్చు ఆదా అవుతుందని సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్ నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5 శాతం లేదా రూ.4.5 లక్షల కోట్ల మేర వృద్ధి కనిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో కలిగే ప్రయోజనాల్లో ఇదొకటని ఆమె వివరించారు. కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్నాయని, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.
Also Read: Maoists Surrender: ఫలించిన స్పెషల్ ఆపరేషన్.. 86 మంది మావోలు లొంగుపాటు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే ఈ విధానాన్ని ముందుకు తీసుకురాలేదని, జమిలి ఎన్నికలపై గతంలో కూడా పలుమార్లు చర్చలు జరిగాయని సీతారామన్ పేర్కొన్నారు. 1960 నుంచి జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశంగా ఉందన్నారు. గుడ్డిగా వ్యతిరేకించే పార్టీ ప్రయోజనాలను గుర్తెరిగి మద్దతిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె హితబోధ చేశారు.
చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత కరుణానిధి ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి సానుకూలత వ్యక్తం చేశారని, కానీ ఆయన కొడుకు సీఎం ఎంకే స్టాలిన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/