AP Govt: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా, ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకొని కళాకారులకు కందుకూరి ప్రతిష్టాత్మక, విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ప్రకటించారు. కందుకూరి అవార్డుల అంశాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక పురస్కారాలను కళాకారులకు అందించేలా పునరుద్ధరించామని ఆయన వివరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు.
నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం, జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నామని కందుల దుర్గేష్ చెప్పారు. కందుకూరి పురస్కారాలకు అర్హులైన రచయితలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏప్రిల్ 7 (సోమవారం) లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న వారు రాష్ట్రస్థాయి అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గతంలో రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని చెప్పారు.
దరఖాస్తులను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ పరిపాలన భవనం నాలుగో అంతస్థులో నేరుగా అందజేయవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారమ్లను అధికారిక పోర్టల్ (www.apsftvtdc.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాజమండ్రిలో శుక్రవారం ‘అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం’ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.
నాటకరంగాన్ని విస్మరించారు
గత ప్రభుత్వంలో కళలు, నాటక రంగాలని పట్టించుకోలేదని వైసీపీపై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు గుప్పించారు. ‘‘కనుమరుగైన కళలను, చేయూతకు నోచుకోని కళాకారులకు అండగా నిలిచి నాటక రంగానికి పునరుజ్జీవం తెస్తాం. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే ఉగాది పురస్కారాలను ప్రదానం చేశఆం. ఆ వెంటనే కందుకూరి పురస్కారాలను ప్రదానం చేస్తున్నాం. ప్రతి ఒక్క కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే నందినాటకోత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేస్తాం.
భూత, భవిష్యత్, వర్తమానాలకు వారధిగా నిలిచే ఏకైక కళారూపం నాటకం. ఒకప్పుడు సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప సాధనం. అలాంటి కళలను ప్రదర్శించే ప్రతిభ గల కళాకారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుంది. రంగస్థలంపై హావభావాలతో, సంభాషణా చాతుర్యంతో, పాత్రోచితమైన వేషధారణతో, నవరసాలకు ప్రతినిధులై ప్రేక్షకుల మనోఫలకంపై చిత్రించేవే నాటకంలోని పాత్రలు’’ అని కందుల దుర్గేశ్ అన్నారు. ఈ సందర్భంగా తాను ప్రదర్శించిన బాలచంద్రుడి ఏకాపాత్రాభినయ పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read: Cyber Criminals Fraud: ఒకే ఒక్క కాల్.. రూ. 40 లక్షలు హాంఫట్.. ఆ తర్వాత?
కాగా, రాజమండ్రిలో ప్రారంభమైన ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో కలిసి మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బాలరామకృష్ణ రాష్ట్ర ఏపీ సాంస్కృతిక సంఘం చైర్పర్సన్ తేజస్వి పోడపాటి, తదితరులు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి 600 మందికి పైగా కళాకారులు హాజరయ్యారు. చిత్రలేఖనాలు, పటచిత్రాలు, మట్టి బొమ్మలు, సాంకేతిక కళారూపాలు మొదలైన అనేక కళారూపాలు వీక్షకులను అలరించాయి.