తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Footpaths incident: విశ్వనగరంలో పాదచారులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యులవుతున్నారు. జరుగుతున్న ప్రమాదాల్లో నెలకు కనీసం 7 గురు మృత్యువాత పడుతుండగా 64 మందికి పైగా గాయపడుతున్నారు. వీరిలో కొందరు శాశ్వత అంగవికలురుగా మారి జీవచ్ఛవాల్లా మిగిలిపోతున్నారు. ఈ విషాదాలకు ప్రధాన కారణం ర్యాష్ డ్రైవింగ్ అని పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే అయినా సురక్షితంగా దాటటానికి ఆయా రహదారులపై సరైన ఏర్పాట్లు లేకపోవటమే పాదచారుల ప్రాణాలు తీస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
2024 చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ లో 89 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వచ్చిపోయే వాహనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. చాలా రహదారులపై అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుండటం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాహనదారులు చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదాలకు కారణమవుతోంది.
Also Readl: Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని ఉత్కంఠ.. కొలిక్కి వచ్చేనా?
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గాలితో పోటీ పడుతున్నట్టుగా రయ్యిన దూసుకెళుతుండటం యాక్సిడెంట్లకు దారి తీస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ముందుకు దూసుకెళ్లటమే లక్ష్యం అన్నట్టుగా వీళ్లు జిగ్ జాగ్ డ్రైవింగ్ చేస్తుండటం. ఇటువంటి పరిస్థితుల్లో అధికశాతం రహదారులపై సురక్షితంగా రోడ్డు దాటటానికి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవటం పాదచారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రమాదాలను తగ్గించటానికి నిత్యం వాహనాలతో కిటకిటలాడే ట్యాంక్ బండ్, మలక్ పేట, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు.
రోడ్డు దాటే ముందు పాదచారులు పెలికాన్ సిగ్నల్ ను ఆన్ చేస్తే వాహనదారులు ఆగాల్సి ఉంటుంది. అయితే, ఈ సిగ్నళ్లను ఏ ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. ఒకవైపు పాదచారులు సిగ్నల్ ఆన్ చేసి రోడ్డు దాటుతున్నా వాహనాలతో రయ్యిన దూసుకెళుతున్నారు. ఇక, కొన్నిచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేసినా వాటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. అన్ని మెట్లు ఎక్కి బ్రిడ్జి పైనుంచి వెళ్లటం ఎందుకనుకుంటూ పాదచారులు రోడ్డు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇక, రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా పాదచారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. ట్రాఫిక్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారితో మాట్లాడగా వాహనాలు నడిపే వారు స్వీయ క్రమశిక్షణను పాటిస్తే ఇలాంటి విషాదాలను తగ్గించవచ్చన్నారు. ఉన్న చోట్ల అయినా పెలికాన్ సిగ్నళ్లను పట్టించుకోవాలని చెప్పారు. పరిమితికి మించిన వేగంతో జిగ్ జాగ్ డ్రైవింగ్ అస్సలు చేయవద్దన్నారు. ఇక, పాదచారులు కూడా జీబ్రా లైన్లు ఉన్న చోటే రోడ్లు దాటాలన్నారు. అప్పుడే కొన్ని ప్రాణాలైనా దక్కుతాయని వ్యాఖ్యానించారు.
Also Read: Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!