తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : TG on BC reservation: విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వంపై ఒకవైపు బీసీ సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి ఇంకొంత ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, హర్యానా తదితర పలు ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై వివరించాలని భావిస్తున్నది. ఇందుకోసం తెలంగాణ పీసీసీ, ఏఐసీసీ తరఫున కొద్దిమందితో టీమ్ను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బీసీ రిజర్వేషన్ బిల్లు స్ఫూర్తిని, దీని వెనక చేసిన సుదీర్ఘమైన కసరత్తును ఈ సమావేశాల సందర్భంగా ప్రాంతీయ పార్టీల నేతలకు వివరించాలన్నది కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం.
TG Govt on Fine Rice: హమ్మయ్య.. ఆ కష్టాలకు ఇక చెల్లు.. ఇది పేదవారి మాట.. ఎందుకంటే?
బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రస్తావించి రాజ్యాంగ సవరణ ద్వారా 42% రిజర్వేషన్ను కల్పించేలా చట్టం చేసేందుకు ఒప్పించేలా అఖిలపక్ష బృందాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో ఢిల్లీ తీసుకెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళే సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మంత్రిని కలిసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన హక్కులు లభించేలా విజ్ఞప్తి చేయనున్నారు. అదే సమయంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ప్రస్తావించి ఒత్తిడి పెంచాల్సిందిగా రాహుల్గాంధీకి కూడా విజ్ఞప్తి చేయనున్నారు. బీసీలకు రిజర్వేషన్లు లభించే విషయంలో వీలైన అన్ని మార్గాల్లో కేంద్రాన్ని నిలదీయాలన్నది సీఎం రేవంత్రెడ్డి ప్రధాన ఉద్దేశం.
ప్రాంతీయ పార్టీల మద్దతు ప్రయత్నాలు :
వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టాలన్నది కూడా కాంగ్రెస్ ఎజెండాలోని ఒక అంశం. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర అనేక పార్టీలు బీసీ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉన్నందున తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదం తెలపాలన్న డిమాండ్ను వివరించి పార్లమెంటులో ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి చేయనున్నది. ఇందుకోసం పలు ఉత్తరాది రాష్ట్రాల పర్యటనకు వెళ్ళి ఈ నెల రోజుల వ్యవధిలో వివరించాలనే ఆలోచనపై కసరత్తు జరుగుతున్నది. తమిళనాట బీసీలకు 69% రిజర్వేషన్ లభించేలా రాజ్యాంగ సవరణ చేసినందున తెలంగాణ విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని సాకారం చేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పార్లమెంటులో దీనిపై గట్టిగా గొంతెత్తేందుకు కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
CPM Leaders demand: వెల్నెస్ కేంద్రాల అక్రమ దందా.. సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీకి అగ్నిపరీక్షగా బీసీ రిజర్వేషన్ :
బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు బీజేపీకి గుదిబండగా మారింది. అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ సంపూర్ణ మద్దతు పలికింది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ డిమాండ్ వచ్చినప్పుడు బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ కార్నర్ అయ్యే అవకాశమున్నది. సానుకూల నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ సాకారమైతే అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ వ్యతిరేకించినట్లయితే బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపీకి జాతీయ స్థాయిలో ముద్ర పడే అవకాశముంటుంది. దీంతో కాంగ్రెస్ సహా బీసీ రిజర్వేషన్ను సమర్ధిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటై రాజకీయంగా బీజేపీని కార్నర్ చేయడానికి అవకాశం ఇచ్చనట్లవుతుంది. దీనికి తోడు తెలంగాణలో బీజేపీ సైతం కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించడం కత్తిమీద సాములా మారింది.
Vanguard in TG: అభివృద్ధిలో రేవంత్ మార్క్.. రాష్ట్రానికి టాప్ గ్లోబల్ కంపెనీ.. భారీగా జాబ్స్!
డీలిమిటేషన్ విషయంలోనూ ఒత్తిడి :
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) విషయంలోనూ బీజేపీపై దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఈ అంశంపైనా పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ విషయంలో ఒత్తిడి పెంచుతున్నట్లుగానే డీలిమిటేషన్ విషయంలోనూ బీజేపీని నిలదీయడం అనివార్యమవుతున్నది. ఈ అన్ని అంశాలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు సహా తెలంగాణ పీసీసీ యాక్టివ్ రోల్ తీసుకుని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలిసే కార్యక్రమాన్ని దాదాపు నెల రోజుల పాటు కొనసాగించే అవకాశమున్నది. డీలిమిటేషన్ అంశంపై ఈ నెలలోనే హైదరాబాద్ వేదికగా జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) రెండో సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నది. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ వ్యూహాత్మక కార్యాచరణతో ఏప్రిల్ నెలలో హడావిడి కార్యక్రమాలు చోటుచేసుకోనున్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు