Heatwave Alert: రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ సమ్మర్ ఎఫెక్ట్ మొదలుకానుంది. నిన్నటి వరకు వర్షాలు కురిసి కాస్త వాతావరణం చల్లబడగా, మళ్లీ భానుడు తన ప్రతాపం చూపే సమయం ఆసన్నమైందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ అని చెప్పవచ్చు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇంతకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడంటే..
ఏపీలో గత కొద్దిరోజులుగా వరుణుడు కరుణ చూపించాడు. దీనితో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవగా, మరికొన్ని జిల్లాలలో మోస్తారు వర్షం కురిసింది. సమ్మర్ సీజన్ లో వర్షాలు కురిసిన వేళ కాస్త వాతావరణం చల్లబడింది. దీనితో ఆయా జిల్లాల ప్రజలకు కాస్త వేడిగాలుల నుండి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. అయితే ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.
బుధవారం శ్రీకాకుళం-15, విజయనగరం-21, మన్యం జిల్లా-10, అల్లూరి జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2, ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అలాగే గురువారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు. మంగళవారం నంద్యాల(D) రుద్రవరంలో41.6°C, ప్రకాశం (D) దరిమడుగులో 41.1°C, నెల్లూరు (D) సోమశిలలో 40.9°C, అన్నమయ్య (D) పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పిపల్లి, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 40.1°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. వడగాల్పుల నేపథ్యంలో చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదన్నారు.
Also Read: Araku Coffee: గిరిజనులకు దక్కిన అరుదైన గౌరవం.. అరకు కాఫీకి జీ హుజూర్ అనేస్తున్నారు..
ఇక తెలంగాణలో..
తెలంగాణలో రేపు పొడి వాతావరణం ఉంటుందని, రేపటి నుంచి 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు తెలంగాణలోని ఆదిలాబాద్ 38.3, భద్రాచలం 38 డిగ్రీలు, నిజామాబాద్ 37.3, ఖమ్మం 36.6 డిగ్రీలు, నల్గొండ 36, హైదరాబాద్ 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మొత్తం మీద ఇక సమ్మర్ సీజన్ అసలు ఎఫెక్ట్ కనపడే సూచనలు ఉన్నాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.