KA Paul: ‘మీకు 72 గంటల టైమ్ ఇస్తున్నా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో మీరు సంపాదించిన డబ్బులను తిరిగి బాధిత కుటుంబాలకు ఇవ్వాలి.. మీరు చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలి..’ అని అల్టిమేటం.. అయితే ఈ వాఖ్యలు చేసింది ముఖ్యమంత్రో, పోలీసు ఉన్నతాధికారులో కాదు.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పట్ల పోలీసులు, ప్రజలు సీరియస్ అవుతుండగానే, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన ఇచ్చిన 72 గంటల అల్టిమేటం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా సంపాదించిన డబ్బులను బాధిత కుటుంబాలకు తిరిగి ఇవ్వాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేనే సుప్రీం కోర్టుకు వెళతా’ అంటూ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంచలన వీడియో పోస్ట్ చేశారు.
ప్రముఖులపై కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల, 25 మంది ప్రముఖ నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రభాస్, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇంతకుముందు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ వంటి 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేఏ పాల్ కామెంట్స్ సంచలనంగా మారాయి.. ఇందుకు కారణం, ఆయన నేరుగా ప్రముఖ సెలబ్రిటీలు, క్రికెటర్ల పేర్లు ప్రస్తావించడమే. ‘ఆన్లైన్ స్కిల్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్ని, వాటర్ బాటిల్ పేరుతో మందుని, ఇలాచి పేరుతో టొబాకోను ప్రమోట్ చేస్తున్నారు. వీటిని సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్, క్రికెటర్లు సైతం బహిరంగంగా ప్రమోట్ చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.
సచిన్ గాడ్ ఆఫ్ ది డెవిల్..
‘సచిన్ టెండూల్కర్ను గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. కానీ, ఇప్పుడు ఆయన గాడ్ ఆఫ్ ది డెవిల్ అవుతున్నారు. ఆయనకు ఈ ప్రమోషన్స్ ఎందుకు?’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. అలాగే విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, మంచు లక్ష్మి సహా దాదాపు 25 మంది సెలబ్రిటీల అరెస్ట్ అవ్వబోతున్నారని పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల 980 మంది ఆత్మహత్య..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణంగా ఇప్పటికే 980 మంది ప్రాణాలు కోల్పోయారని కేఏ పాల్ ఆరోపించారు. ‘మీ ప్రమోషన్స్ కారణంగా మన యువత బలవుతున్నారు. 980 మంది జీవితాలను మీరు నాశనం చేశారు. మీరు నరహత్య చేశారు. మిమ్మల్ని నమ్మి ఫాలో అయ్యే వారి జీవితాల్లో చీకట్లు నింపారు. మీకు మానవత్వం లేదా, దైవత్వం లేదా? రాక్షసుల్లా వారి జీవితాన్ని నాశనం చేయడమేనా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పశ్చాత్తాపం లేకపోతే సుప్రీం కోర్టుకే..
రాజకీయ నాయకులు, పోలీసులు బెట్టింగ్ ప్రమోటర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఊరుకుంటే, తానే ఈ సెలబ్రిటీలను సుప్రీం కోర్టుకి నడిపిస్తానని హెచ్చరించారు. నటుడు ప్రకాశ్ రాజ్ మాదిరిగా అందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, వీరి ప్రమోషన్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని సూచించారు.
Also Read: Mahabubabad Crime: మరీ ఇంత దారుణమా.. ప్రియుడి కోసం బిడ్డనే.. తల్లి చేసిన ఘోరం!
బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తు వేగవంతం..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కేసులు పెరుగుతున్నాయి. పలువురు ప్రముఖ యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యాప్స్ను ప్రమోట్ చేయడంతో, యువత భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయింది. పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవలే పలువురిపై కేసులు నమోదు కాగా, మరికొందరు విచారణలో ఉన్నారు. కేఏ పాల్ చెప్పిన 72 గంటల గడువు ముగిసేలోపు, ఏమైనా సంచలన పరిణామాలు జరుగుతాయా? అన్నది వేచిచూడాలి!