Vijayasai Reddy: ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (VijayaSai Reddy) ఒకరు. వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తొలి నుంచి కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో జగన్ పై సైతం విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతూ ఆయన పెట్టిన పోస్ట్ రాజకీయంగా చర్చలకు తావిస్తోంది.
ఆ ట్వీట్ ఏంటంటే!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేసి ట్వీట్.. బీజేపీ (BJP Party)కి చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. విజయసాయిరెడ్డి ట్వీట్ విషయానికి వస్తే ‘1979-2010 మధ్య చైనా 9.91% జీడీపీ వృద్ధిని సాధించింది. 1984లో అత్యధికంగా 15.2% పీక్ మార్క్ ను అందుకుంది. భారత్ 6-6.5% వృద్ధి రేటు వద్దే స్థిరపడాల్సిన అవసరం లేదని, దశాబ్ద కాలం పాటు డబుల్ డిజిట్ గ్రోత్ మనమూ సాధించవచ్చని ప్రధాని మోదీ తన రిఫార్మ్స్ ద్వారా చేసి చూపించారు’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
నెటిజన్లు సెటైర్లు
ప్రధాని మోదీని సమర్థిస్తూ విజయసాయిరెడ్డి పోస్టు పెట్టడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా ప్రధాని మోదీ (PM Modi)ని ప్రసన్నం చేసుకోవడానికేనా అని ప్రశ్నిస్తున్నారు. మోదీని కాకాపడితే బీజేపీలోకి ఎంట్రీ లభిస్తుందని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. అటు పొలిటికల్ గానూ విజయసాయిరెడ్డి తీరుపై చర్చ జరుగుతోంది. ఇకపై ఏ పార్టీలో చేరనని చెప్పి ఇప్పుడు సడెన్ గా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తడంపై ఆసక్తికరంగా మారింది.
విజయసాయిరెడ్డి
వాస్తవానికి చాలా రోజుల క్రితమే బీజేపీ చేరేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఏపీలోని బీజేపీ ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంగా భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విజయసాయిరెడ్డి క్రీయాశీలకంగా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వం.. చంద్రబాబుపై ఏ స్థాయిలో మాటల యుద్ధం చేసిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు విజయసాయిరెడ్డి రాకను వ్యతిరేకించినట్లు టాక్. చంద్రబాబు అనుమతిస్తే పార్టీలో చేర్చేంచుకునేందుకు తమకు ఇబ్బంది లేదని హైకమాండ్ చెప్పినట్లు ప్రచారం జరిగింది.