Betting Apps: పలువురి ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ తరహా యాప్లను ప్రమోట్ చేసిన 11మంది సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిలో ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేశారు. ఆధారాల సేకరణ పూర్తయిన తర్వాత.. ఈ ఇద్దరితో పాటు మిగతా వారిని అరెస్టు చేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.
మియాపూర్ మాతృశ్రీనగర్ నివాసి వినయ్ వంగల ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన బుల్లితెర నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో అమాయకుల కష్టార్జితాన్ని కొల్లగొడుతుండటంతో పాటు పలువురి ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఈ క్రమంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేశయని సుప్రిత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్లపై కేసులు నమోదు చేశారు.
Also Read- Star Heroine: బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?
వీటినే ప్రమోట్ చేశారు..
పోలీసులు ఇప్పటివరకు జరిపిన విచారణలో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయిలు పరీ మ్యాచ్ అన్న వెబ్ సైట్ను ప్రమోట్ చేసినట్టుగా వెల్లడైంది. ఇక, విష్ణుప్రియ తాజ్ 777 అనే బెట్టింగ్ యాప్కు ప్రచారం చేయగా, అజయ్ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. విన్ బజ్’, సన్నీ ‘టార్గెట్ గేమర్స్’, సుధీర్ క్రికెట్ ‘విన్ ఎనలిస్ట్’ అనే యాప్లను ప్రమోట్ చేసినట్టుగా తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు నిందితులకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఇందులో ఏయే వీడియోలను.. ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేశారనే వివరాలను సేకరిస్తున్నారు.
నోటీసులు…
ఇక, ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు రావాలంటూ విచారణాధికారులు విష్ణుప్రియ, టేస్టీ తేజలకు నోటీసులు జారీ చేశారు. కేసులోని మిగతా నిందితులకు కూడా నోటీసులు ఇవ్వాలనుకున్నప్పటికీ వీళ్లంతా తమ తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నట్టుగా సమాచారం. వీరు వారి ఇళ్లల్లో కూడా లేరని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం వీరి కోసం విచారణాధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
సమయం కోరిన విష్ణుప్రియ, టేస్టీ తేజ…
ఇదిలా ఉండగా, నోటీసులు అందుకున్న విష్ణుప్రియ, టేస్టీ తేజలు మంగళవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు రాలేదు. తమకు మూడు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను అడిగారు. వారి తరపున ఈ విషయాన్ని శేఖర్ భాషా పోలీస్ స్టేషన్కు వచ్చి దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 3 రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించారని శేఖర్ భాష వివరించారు. కేసుకు, మీడియాకు భయపడి విష్ణుప్రియ, టేస్టీ తేజా విచారణకు రాలేదని, పోలీసులు ఇచ్చిన గడువులోగా కచ్చితంగా వచ్చి విచారణకు హాజరవుతారని ఆయన వెల్లడించారు. బెట్టింగ్ యాప్లను తెలిసి ప్రమోట్ చేసినా, తెలియక ప్రమోట్ చేసినా తప్పేనని శేఖర్ భాష అన్నారు.
రిగ్రెట్ వీడియోలు…
పోలీసులు కేసులు నమోదు చేయటంతో నిందితులుగా ఉన్న బుల్లితెర నటులు, యూ ట్యూబర్స్, సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ల గుండెల్లో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కొంతమంది తెలియక తప్పు చేశామంటూ వీడియోలు తయారు చేసి తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేశారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయమని వాటిల్లో పేర్కొన్నారు. తెలియక చేసిన తప్పులను క్షమించాలంటూ విజ్ఞప్తులు చేశారు.
Also Read- Mad Square: మూడో పాటతో వచ్చార్రోయ్.. మాస్ మ్యాడ్నెస్ చూడండ్రోయ్!
ఎవ్వరినీ వదిలి పెట్టం..
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎవ్వరినీ వదిలి పెట్టమని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ (West Zone DCP Vijay Kumar) స్పష్టం చేశారు. సోషల్ యాక్టివిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కేసులో ఉన్న 11 మంది యూ ట్యూబర్స్, ఇన్ఫ్లూయెన్సర్లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ముందుగా ఆధారాలను సేకరించి, ఆ తర్వాత నిందితులకు నోటీసులిచ్చి పిలిచి విచారణ చేయటమా? నేరుగా అరెస్ట్ చేయటమా? అన్నది నిర్ణయిస్తామన్నారు. చాలామంది ఇన్ఫ్లూయెన్సర్లు సులభంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఊహించనంత డబ్బు సంపాదించవచ్చంటూ ప్రజలకు ఆశ చూపుతున్నారని తెలిపారు. ఈ వీడియోలు చూసి బెట్టింగుల్లో డబ్బు పెడుతూ చాలామంది ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నారన్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ను ఎవరు ప్రమోట్ చేసినా చట్టప్రకారం నేరమే అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ అనే ఇన్ఫ్లూయెన్సర్ అయితే అన్ని హద్దులు దాటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఏమాత్రం విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గలీజ్ వీడియోలు చేస్తున్నట్టు తెలిపారు. తన వీడియోల కోసం చిన్నపిల్లలను సైతం వాడుకుంటున్నాడన్నారు. ఇలా చేస్తున్న అందరిపై నిఘా పెంచినట్టు చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు