Pawan Kalyan: తన ముందు ఆ పేరు పలకవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం వేదికగా అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయకేతనం విజయ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పవన్ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు ముందుగా కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సంధర్భంగా ఓజీ.. ఓజీ అంటూ కేకలు వేయగా పవన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పవన్ ప్రసంగం ప్రారంభించి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో మాట్లాడారు. ఇక అసలు ప్రసంగాన్ని పవన్ ప్రారంభించగానే, అభిమానులు ప్రసంగానికి అడ్డుతగిలేలా ఓజీ ఓజీ.. అంటూ హోరెత్తించారు.
దీనితో అభిమానులపై పవన్ కాస్త అసహనం వ్యక్తం చేసి క్లాస్ తీసుకున్నారు. తన సినిమాల పేర్లు ఎందుకు అరవద్దు అంటానంటే, ఏదో తక్కువ చెయ్యాలని కాదు.. 463 మంది జనసైనికులు సినిమాల కోసం కాదు.. సిద్ధాంతాల కోసం పాటు పడుతూ చనిపోయారన్నారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వారి గౌరవం మనం కాపాడాలని అభిమానులను కోరారు.
థియేటర్ కు వెళ్లి జనసేన అంటూ కేకలు వేయడం ఎంత తప్పో, పార్టీ మీటింగ్ కు వచ్చి సినిమా పేరు పలకడం అంతే తప్పన్నారు. సినిమాను పార్టీని ఒకటే విధానంలో చూడవద్దని అభిమానులకు పవన్ క్లాస్ తీసుకున్నారు. సినిమా సినిమా అంటూ ఉంటే, అన్యాయాలను ఎప్పుడు ఎదిరిస్తారంటూ పవన్ ప్రశ్నించారు. బాల్యంలోనే తాను ప్రశ్నించానని, అదే ఇప్పుడు మీ ముందు ఉండేలా చేసిందన్నారు.
అల్లరి చిల్లరిగా తిరిగే వారు ఎవరూ తనకు వద్దని, తమ పార్టీ సిద్దాంతాలతో నడిచే వారు కావాలన్నారు. ఇలా పవన్ క్లాస్ పూర్తి కాగానే మరలా ఓజీ ఓజీ.. అంటూ కేకలు వేసిన అభిమానులను చూస్తూ.. తాను చెప్పినా మీరు ఆగేలా లేరని పవన్ చెప్పడంతో సభ ఇక సైలెంట్ గా మారింది. మొత్తం మీద పవన్ పిఠాపురం సభ ద్వారా సినిమాలను, పాలిటిక్స్ ను ఒకే రూపంలో చూసి తమను ఇబ్బంది పెట్టవద్దని అభిమానులను కోరారని చెప్పవచ్చు.
Also Read: Pawan Kalyan: ఓటమికి బెదరను.. అదరను.. అసలు రహస్యం చెప్పేసిన పవన్ కళ్యాణ్
ఇప్పటికే పలు బహిరంగ సభల ద్వారా పవన్.. సీరియస్ క్లాస్ తీసుకున్నప్పటికీ అభిమానులు మాత్రం ఓజీని వదల బొమ్మాళీ అంటూ వదలక పోవడం విశేషం. అంతేకాకుండా పవన్ ప్రసంగం సమయంలో పవర్ స్టార్ సీఎం.. సీఎం అంటూ అభిమానులు కేరింతలు వేయడం మరో విశేషం.