Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలోని రైతులు, యువత, మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉండనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ హాజరు
బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR).. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో భారాస (BRS) అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతకుముందు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద కార్యకర్తలు సందడి చేశారు. తమ నాయకుడు అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీకి బయలుదేరిన ఆయన కారుపై పూలు చల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బీఏసీ సమావేశం
గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీలో బీఏసీ (BAC) సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు. అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య పలు అంశాలపై తీవ్ర చర్చ జరిగే అవకాశముందని అంచనా.
Also Read: Pakistan Train Hijack: పాక్ లో భీకర పోరు.. 27 మంది ఉగ్రవాదులు హతం
నెలాఖరు వరకూ సమావేశాలు!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశముంది. మార్చి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చించనున్నారు. అలాగే, 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ , ఎస్సీ వర్గీకరణ తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.