వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే
కూటమి నేతలు, ప్రభుత్వం చెప్పినట్లు ప్రవర్తిస్తే…
భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి నేతలకు పరామర్శ
Ex minister Roja: కూటమి ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే అధికారులు భవిష్యత్తులో కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. రానున్న రోజుల్లో వైసీపీ తప్పకుండా అధికారంలో వస్తుందని, అధికారులు, కూటమి ప్రభుత్వ నేతలను ఎవ్వరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే జమిలి ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల్లో వైసీపీ (Ycp) అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు. మంగళవారం చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి వైసీపీ నేతలు రంగనాథం, శమోహన్, మరో ఐదుగురిని రోజా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రెడ్ బుక్ (Red Book) రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు బెయిల్ వచ్చే లోపు మరోకేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టారని, పీటీ వారెంట్ కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదని రోజా మండిపడ్డారు. పోసాని కృష్ణ మురళి కేసు కూడా ఇదేవిధంగా కేసులు పెడుతున్నారుని, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు.
చేతగాని ప్రభుత్వం..
‘ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరాచకం సృష్టిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది. ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే అధికారులు నిద్ర పోతున్నారా? హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మారిపోయింది. పుత్తూరు గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మారిపోయింది. నగరి నియోజకవర్గంలో విద్యార్థులు గంజాయి తాగి ప్రధానోపాధ్యాయుడిని కాలర్ పట్టుకున్న సంఘటన జరిగింది’ అని రోజా చెప్పారు.
Also Read :
VCS Resignation: బొత్స వర్సెస్ లోకేశ్; వీసీల రాజీనామాపై మాటల యుద్ధం