VCS Resignation: ఏపీ శాసన మండలిలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. రాజీనామాలపై ఆధారాలను శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ సభ ముందు ఉంచారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ వాటిని తప్పుబట్టారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని పేర్కొన్నారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. వీసీల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం, తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని ఎద్దేవా చేశారు. రాజీనామాలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నియమించిన వీసీలను ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? అని సర్కారును సూటి ప్రశ్న సంధించారు.
అనంతరం మాట్లాడిన మంత్రి లోకేశ్…వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదన్నారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వైసీపీ చేసిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలన్నారు మండలి ఛైర్మన్ను మంత్రి లోకేశ్ కోరారు.
మొత్తం 17 మంది రాజీనామాలు చేశారన్న లోకేశ్… వారిలో 10 మంది పర్సనల్, నో రీజన్స్ అని రాశారని, ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు వివరించారు. మరో ఐదుగురు ఇన్స్ట్రక్షన్ వచ్చాయని రాసుకొచ్చారని, అంతేగానీ ఫలానా వారు బెదిరించారని అందువల్లే తాము రాజీనామా చేశామని ఎక్కడ చెప్పలేదన్నారు.
జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ప్రసాద్రెడ్డి అని, ఆయనకు వీసీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. రాజీనామా చేసిన మరో వీసీ రాజారెడ్డి చెల్లెలు కోడలని తెలిపారు.
Also Read:
Posani Krishnamurali : ముందు మాకే అప్పగించండి.. పోసాని కోసం 17 పోలీస్ స్టేషన్ల పోటీ..