Cm Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు అస్సలు సహించేది లేదన్నారు. గ్రూపు రాజకీయాలతో ఎమ్మెల్యే టికెట్లు రావన్నారు. ఎమ్మెల్యేలు చేసిన పనితీరుతోనే మరోసారి అసెంబ్లీకి వస్తారని.. ప్రజలు పనిచేసిన వారినే గుర్తుంచుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్ లో టీడీఎల్పీ మీటింగ్ చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ (tdp) ఎమ్మెల్యేలు, మంత్రులతో కీలక విషయాలపై చర్చించారు.
ఏపీ ప్రజలకు మంచి బడ్జెట్ ను అందించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా సరే.. సంక్షేమాన్ని మాత్రం వదిలిపెట్టబోమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని.. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దన్నారు. ఈ ఐదేళ్లు ఎంత బాగా పనిచేస్తే మళ్లీ అంత భవిష్యత్ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కచ్చితంగా అసెంబ్లీకి రావాలని.. మరోసారి ఎన్నికయ్యేలా పనిచేయాలని ఆదేశించారు.
కొందరు పార్టీలో కావాలని గ్రూపులు మెయింటేన్ చేస్తున్నట్టు తన వద్దకు వచ్చిందన్నారు. ఇలాంటి గ్రూపు రాజకీయాలను అస్సలు సహించేది లేదని చెప్పారు. గ్రూపు రాజకీయాలతో గెలిచే అవకాశాలు లేవని.. ప్రజలు పనిచేసిన వారికే పట్టం కడుతున్నట్టు గుర్తు చేశారు.