Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావి దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. రేపు జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి క్రిష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనులు కొట్లాడారని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పదేళ్లపాటు నియంతృత్వ పాలనే సాగిందని, అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, కాబట్టి, ప్రజలంతా ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు.
అమరవీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని పేర్కొంటూ ఆనాడు సోనియా గాంధీ వెనుకడుగు వేస్తే ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాకపోయేదని మంత్రి పొన్నం అన్నారు. కాగా, ప్రధాని మోదీ మాత్రం తెలంగాణ అంటే మొదటి నుంచి చిన్న చూపుతోనే ఉన్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటను అవమానిస్తూ చాలా సార్లు మాట్లాడారని మండిపడ్డారు. తల్లిని చంపి పిల్లలను బిడ్డను తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ప్రజలంతా సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో రాజకీయ విమర్శలకు వేదిక చేసుకోరాదని సూచన చేశారు. అన్ని పార్టీలు సంబురాలు చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ కోసం కృషి చేసిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సేవలను మరిచిపోమని పేర్కొన్నారు. అలాగే.. ఈ వేడుకలకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించామని, ఆయన తప్పకుండా ఈ వేడుకలకు రావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను ఈ పదేళ్ల ఆవిర్భావ వేడుకల్లో ఏనాడైనా కేసీఆర్ ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. కానీ, తాము కేసీఆర్ను ఆహ్వానిస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఆవిష్కరిస్తామని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్ర చిహ్నంపై గతంలో కేసీఆర్ ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని విమర్శించారు. తాము ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నామని వివరించారు. అందుకే దానికి సమయం పడుతుంది కాబట్టి ఈ వేడుకల్లో చిహ్నాన్ని ఆవిష్కరించడం లేదని తెలిపారు.
కేసీఆర్ పాల్గొనాలి: మంత్రి జూపల్లి
తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసే శక్తి జయ జయహే తెలంగాణ పాటకు ఉన్నదని మంత్రి జూపల్లి క్రిష్ణారావు అన్నారు. మెరుగైన రాష్ట్రాన్ని కలగంటూ తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేశారని, వారు కన్న కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటారని, కానీ, గత ప్రభుత్వం అందుకు భిన్నంగా నడుచుకుందని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పి పంపించారని తెలిపారు. ఈ వేడుకలకు సోనియా వస్తారనే అనుకుంటున్నామని, దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా పాల్గొనాలని అభిప్రాయపడ్డారు.