- మంత్రి వర్గ విస్తరణపై రేవంత్ సర్కార్ పై పెరుగుతున్న ఒత్తిడి
- జులై తొలి వారంలో విస్తరణకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్
- ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 12 మందితో కూడిన మంత్రులు
- మరో ఆరుగురికి ఛాన్స్ ఇద్దామనుకుంటున్న రేవంత్
- ఇప్పటికే అధిష్టానం నుంచి అనుమతులు తీసుకున్న రేవంత్
- మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కష్టపడినవారికి ఛాన్స్
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినవారికీ అవకాశం
- పరిశీలనలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు
Reventh extention of Cabinet ministers July First week:
పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. పాలనపై ఫోకస్ పెరిగింది. రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లో తొలుత 11 మంది మంత్రులతోనే క్యాబినెట్ ఏర్పడింది. క్యాబినెట్ ను విస్తరించాలని అనుకున్నా ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల హడావిడి పూర్తయింది కాబట్టి మంత్రి వర్గం విస్తరించాలని రేవంత్ రెడ్డిపై పదవి రాని మంత్రులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ముందు అందుకే విస్తరించలేదు
పార్లమెంట్ ఎన్నికల ముందే క్యాబినెట్ ను విస్తరించాలని ఉన్నా ఆ ప్రతిపాదనను మానుకున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నిక ల ముందు ఈ ప్రక్రియ జరిపివుంటే ఆ ప్రభావం ఎన్నికలపై చూపించవచ్చు. ఎందుకంటే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు ఎన్నికలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. గ్రూపులు కట్టి పార్టీకి నష్టం కలిగించవచ్చు. ఇదే ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు పార్టీ మనుగడ కోసం కష్టపడ్డారు? ఎవరెవరు పార్టీ విజయానికి పాటుపడ్డారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని క్యాబినెట్ విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
జులై తొలి వారంలోనే
ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణపై సీఎం చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా, మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం నలుగురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.
పెరుగుతున్న ఆశావహులు
లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. విస్తరణలో శ్రీహరికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత బీజేపీలో చేరి… ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నా… రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్ఛార్జిగా వ్యవహరించడం లాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం వినిపిస్తోంది. పార్టీలో చేరేముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమసాగర్రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వివేక్ లేదా ప్రేమసాగర్రావులలో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించినా సామాజిక సమీకరణాల్లో చోటు లభించలేదు.
మైనారిటీలకూ ఛాన్స్
ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీల నుంచి సైతం ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద తాజా విస్తరణలో నలుగురికి అవకాశం ఉంటుందని, రెండు స్థానాలను ఖాళీగా పెట్టి కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని తెలుస్తోంది.