- తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి ప్లాన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు
- ఏపీలో ఇండిపెండెంట్ గా 135 స్థానాలు గెలుచుకున్న టీడీపీ
- అదే ఉత్సాహంతో తెలంగాణలో పార్టీకి పునరుత్తేజం
- రోజురోజుకూ కుదేలవుతున్న బీఆర్ఎస్
- పేరు మార్పుతో ప్రాంతీయత కోల్పోయిన బీఆర్ఎస్
- బాబుతో టచ్ లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు
- టీ.టీడీపీ అధ్యక్ష పదవిపై పెరుగుతున్న పోటీ
- త్వరలోనే తెలంగాణ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు
Telugu desam party re establishment plan in talangana by chandrababu:
అల్లు అర్జున్ ఓ మూవీలో ఓ డైలాగ్ అంటాడు. ‘నేను తెలుగు భాష లెక్క..ఆడా ఉంటా..ఈడా ఉంటా’ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మదిలో ఇదే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలలో సంచలన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీకి అటు బీజేపీ, ఇటు జనసేన కూటమి కలిసి వచ్చింది. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ 135 స్థానాలను ఇండిపెండెంట్ గా సొంతం చేసుకోవడం విశేషం. భవిష్యత్ లో కూడా ఆ పార్టీకి ఎలాంటి ఢోకా లేకుండా ఏపీ ఓటర్లు పట్టం కట్టారు. ముఖ్యంగా జగన్ హయాంలో రాజధాని లేకుండా చేసిన అంశాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కేంద్రం అండతో తప్పకుండా రాజధాని నిర్మాణం జరుగుతుందని నమ్ముతున్నారు. అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మదిలో తెలంగాణలో సైతం తన పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి రాజకీయ పరిణామాలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ అవుతూ వస్తోందో అప్పటినుంచే చంద్రబాబు ఇక్కడ పాగా వేయాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆలోచించొచ్చు అనుకున్నారు.
తెలంగాణపై నజర్
ఇప్పుడు ఏపీ సమస్య తీరిపోయింది కాబట్టి ఇక తెలంగాణపై నజర్ పెట్టారు చంద్రబాబు. అయితే బీఆర్ఎస్ లో ఎక్కువ శాతం ఉన్న ఎమ్మెల్యేలంతా ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. అప్పట్టో ఆపరేషన్ గులాబీ అంటూ టీడీపీని తెలంగాణలో లేకుండా చేశారు కేసీఆర్. సెంటిమెంట్ పేరు చెప్పి తెలుగుదేశాన్ని ఏపీకే పరిమితం అయ్యేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పీకలలోతు కష్టాల్లో ఉంది. మెల్లిగా క్యాడర్ సైతం దూరం అవుతున్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో ఏపీలో కూటమినే తెలంగాణలోనూ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకు బీజేపీ, జనసేన సైతం ఓకే అన్నట్ల తెలుస్తోంది. కనీసం వచ్చే ఎన్నికలలోపు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలంటే బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేతలనే తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు చంద్రబాబు.
మాస్టర్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు చంద్రబాబు. టీడీపీకి పూర్వ వైభంపై దృష్టి తెలంగాణలో పార్టీని పునర్నించాలనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెరో 8 స్థానాలను దక్కించుకోగా హైదరాబాద్ నుంచి ఎంఐఎం విజయం సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రాంతీయ వాదంతోపాటు సెంటిమెంట్ రాజకీయాలు ప్రస్తుతం నడవకపోవడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ కు కలిసిరావడంలేదు. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.
ఆపరేషన్ టీడీపీ
బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా.. బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పార్టీని నేతలు విడిపోయారుకానీ కార్యకర్తలు వీడలేదు. వారంతా అలాగే ఉన్నారు. ఈ సమయంలో పార్టీ ఎదుగుదలపై దృష్టిపెట్టడం సరైన నిర్ణయమని ఆయన భావిస్తున్నారు. కేంద్రంలో కూడా తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతలంతా భవిష్యత్తు కోసం ఆలోచించి తిరిగి టీడీపీలోకి వస్తారనే అంచనాలున్నాయి. దీనిపై త్వరలోనే తెలంగాణ పార్టీ నేతలతో మరోసారి చంద్రబాబు సమగ్ర ప్రణాళికా వ్యూహంతో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి స్థానం ఖాళీగా ఉంది. అధ్యక్షుడిని నియమించడంతోపాటు పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. అవసరమైతే తనతో నిరంతరం టచ్ లో ఉండాలని, పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఓ ఇన్ ఛార్జిని కూడా నియమిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.