= బీసీ నినాదంతోనే జనాల్లోకి..?
= అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు
= తీన్మార్ షెడ్యూల్ ఖరారు..?
= వరంగల్ తరహాలోనే నిర్వహణ
= వివిధ బీసీ సంఘాలు మద్దతు
= కొత్త పార్టీ పెట్టాలంటూ ప్రపోజల్స్
= పార్టీ సస్పెన్షన్ తర్వాత హాట్ టాపిక్
Teenmar Mallanna : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : బీసీ నినాదంతోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) జనాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టి బీసీలను చైతన్యం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభ తరహాలోనే అన్ని కొత్త జిల్లాల్లో భారీ మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బీసీలకు రాజ్యాధికారం రావాలనే టార్గెట్తో కార్యక్రమాలు చేయనున్నారని తెలుస్తున్నది. ఈ ఎజెండాకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ సంఘాలు కూడా మద్దతివ్వడం గమనార్హం. తనను సస్పెండ్ చేస్తారని ముందే ఊహించిన తీన్మార్.. భవిష్యత్ కోసం అప్పటికే తగిన స్థాయిలో ప్రణాళికను కూడా కొన్ని రోజుల క్రితమే ఫిక్స్ చేసుకున్నారట. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడే సస్పెన్షన్కు తాను మానసికంగా ప్రిపేర్ అయ్యారని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారం కోసం ఆయన వద్ద ప్రత్యేక వ్యూహం ఉన్నదని మల్లన్న టీమ్లోని ఒక సభ్యుడు చెప్పారు.
కొత్త పార్టీ పెట్టాలనీ ప్రపోజల్స్..?
ఇక బీసీలకు ప్రత్యేకంగా ఒక కొత్త పార్టీ పెట్టాల్సిందేనని పలు బీసీ సంఘాల నుంచి కూడా మల్లన్నకు రిక్వెస్టులు వస్తున్నట్లు తెలిసింది. పకడ్బందీగా పార్టీ పెడితే, కాంగ్రెస్ (Congress) పార్టీ నుంచి కూడా జాయినింగ్స్ పెరుగుతాయని ఊహిస్తున్నారు. బీసీలు దేనికి తక్కువ కాదని, బీసీలంటే బిగ్ క్యాస్ట్ అనే స్లోగన్ను జనాల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. తీన్మార్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బీసీ సంఘాలు ఆలోచిస్తున్నాయి. అయితే కొత్త పార్టీపై మల్లన్న ఏం స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
సోషల్ మీడియాలో పుల్ ట్రోల్స్..?
నెక్ట్స్ తీన్మార్ మల్లన్న భవిష్యత్ ఏమిటి? కొత్త పార్టీ పెడతారా? బీజేపీ, టీడీపీ పార్టీలలో చేరుతారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. తీన్మార్ మల్లన్న అంశంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నదని కొందరు పోస్టులు పెడుతుండగా, మరికొందరు బీసీలపైనే ఈ వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ చాలా మంది కీలక నేతలకు షోకాజ్లు వెళ్లాయని, వాళ్లపై తీసుకోకుండా ముందు తీన్మార్పై ఎలా తీసుకుంటారని మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. వీటన్నింటికీ తీన్మార్ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ.. ఈ కులానికి ఇదే లాస్ట్ సీఎం.:
= సంగెం సూర్యారావు, బీసీ సమాజ్ అధ్యక్షుడు
“కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ. ఆ సామాజికవర్గం నుంచి ఇదే లాస్ట్ సీఎం. బీసీల్లో మార్పులు చూడబోతున్నారు. సమాజాన్ని చైతన్యం చేస్తాం. బీసీ జేఏసీ (Bc Jac) ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందిస్తున్నాం. గతంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు సైతం పార్టీ రూల్స్ బ్రేక్ చేశారు. కానీ వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. బీసీ వర్గాలకు చెందిన బిడ్డ అయినందుకే మల్లన్నపై చర్యలు తీసుకున్నారు. ఆ సస్పెండ్లకు తీన్మార్ భయపడడు. కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ బీసీ నేత శివ శంకర్ లేకుంటే ఆ పార్టీ మట్టికొట్టుకుపోయేది. ఆ జ్ఞానం పార్టీ నేతల్లో లేదు. గతంలో దామోదర సంజీవయ్యను దించేందుకు కూడా రెడ్డి నేతలు ప్రయత్నించారు. అందుకే కేవలం దాదాపు రెండేళ్లకు పైగా మాత్రమే ఆయన సీఎంగా పనిచేయాల్సి వచ్చింది. పదవుల కోసం ఇతరులను బలి చేయడమే కాంగ్రెస్లోని రెడ్డి నాయకుల పని” అని బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు పేర్కొన్నారు.