TS News: 4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు
880 మంది స్కూల్ అసిస్టెంట్లకు..
811 మంది ఎస్జీటీలకు హెడ్ మాస్టర్లుగా
2,763 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ ప్రభుత్వం (TS News) ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ ప్రక్రియను మంగళవారం పూర్తి చేసింది. మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 811 మంది ఎస్జీటీలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కల్పించింది. 2,763 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో, విద్యాశాఖ మరింత బలోపేతం కానున్నది. పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో మౌలిక సమస్యలు నెలకొంటున్నాయి. ఈ ప్రమోషన్లతో సమస్య పరిష్కారంతో పాటు ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారికి ప్రమోషన్ రూపంలో శుభవార్త అందినట్టు అయింది.
పారామెడికల్ ప్రమోషన్లు ఇవ్వరా?: జేఏసీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పారామెడికల్ ఉద్యోగుల ప్రమోషన్లు ఆలస్యం కావడంపై పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డైటీషియన్, బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వంటి పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని జేఏసీ ఆరోపిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ప్రమోషన్ల కోసం లిస్ట్ తయారు చేసి, చివరి నిమిషంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించింది. డీఎంఈలో ప్రొఫెసర్లు, ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి మాత్రం వేగంగా ప్రమోషన్లు ఇస్తున్నారని జేఏసీ పేర్కొంది. పారామెడికల్ సిబ్బందికి ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డైటీషియన్ ప్రమోషన్ల ఆలస్యం వెనుక డీఎంఈ అధికారులు, డైట్ కాంట్రాక్టర్ల పాత్ర ఉన్నదని జేఏసీ నేత నిజాముద్దీన్ చెప్పారు.