Maha Lakshmi Scheme: మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) మరో మైలురాయిని అధిగమించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నుంచి మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. విడుదల చేసిన మీడియా ప్రకటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ ఆర్టీసీలో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీని విలువ రూ. 6,700 కోట్లు అని తెలిపారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. ఎట్టకేలకు ఆస్పత్రి వైద్య సేవలకు మోక్షం..
మహిళా ప్రయాణికుల రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన బస్సుల కొనుగోలు చేస్తూ మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, ఇతర సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూర ప్రాంతాల ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఆర్టీసీ వృద్ధి సాధించడం అభినందనీయం అన్నారు. ప్రతి మహిళా నెలకు ₹4-5 వేల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు..
ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్లలో బ్యానర్ల ప్రదర్శన చేయాలని, సంబరాలు నిర్వహించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బస్ స్టేషన్లలో నిర్వహించే సంబరాలకు స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. మహిళా ప్రయాణికులతో ప్రసంగాలు చేయించాలని అన్నారు.
డిపోలు, బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతులతో సత్కరించాలన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించాలని, పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు మొదలైన బహుమతులతో 5 మంది బహుమతి గ్రహీతలను సత్కరించాలని మంత్రి సూచించారు. ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 మంది ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని కూడా సత్కరించాలని మంత్రి ఆదేశించారు.
Also Read: Tahsildar Report: ముఖ్యమంత్రి రేవంత్ చేతికి తహశీల్దార్ల రిపోర్ట్?
