KTR: తెలంగాణలో మొదలైన మార్పు
కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రారంభం
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మహబూబాబాద్, స్వేచ్చ: ‘‘తెలంగాణలో మార్పు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశామని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11 సార్లు రైతుబంధు పథకం కింద రూ. 72 వేల కోట్లు వేశారని ఆయన వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్లో శనివారం సర్పంచులు, ఉప సర్పంచ్గా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దొంగ మాటలు, అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలకు అన్ని రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలపై, దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ ప్రజలను మోసం చేశారన్నారు. కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొన్ని జంతువులు మొరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క మీడియా సమావేశానికే వణికిపోతున్నారన్నారు. ప్రజలను మోసం చేయడం ఆపి, వెంటనే హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Also- Bigg Boss Sanjana: నా ప్రమేయం లేకుండా ఓ ఘటన.. బిగ్బాస్ టాప్-5 ఫైనలిస్ట్ సంజనా ప్రెస్మీట్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. అధికార పార్టీ అరాచకాలను, అక్రమాలను తట్టుకొని మరీ భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా మన పార్టీ నేతలు గెలిచారు. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి వంటి పెద్ద నాయకులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ వీడి పారిపోతే, గ్రామ గ్రామాన ఉన్న పార్టీ నేతలు నిలబడి కొట్లాడి గెలిచారు. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీ ఆర్ ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను తెలుసుకొని, కాంగ్రెస్ ప్రలోభాలకు తలవొగ్గకుండా గ్రామాలకు మంచి చేసే అవకాశం మనకు ఉన్నదన్న విషయాన్ని సర్పంచులు గుర్తించాలన్నారు.
Read Also- Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?
‘‘తండాలను గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్. ఒకప్పుడు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది. అటువంటి గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం. దేశంలో 3 శాతం జనాభా లేని తెలంగాణకు 30 శాతం కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. గెలిచిన సర్పంచులను బెదిరిస్తారు. కానీ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి అబ్బ సొత్తు కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామానికి సర్పంచ్ అలాగే. కేంద్రం విడుదల చేసే నిధులలో 75 శాతం గ్రామ పంచాయతీకే నేరుగా వస్తాయి. రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. మిగతా గ్రామాల సర్పంచులకు ఆదర్శంగా ఉండేలా బీఆర్ఎస్ సర్పంచుల గ్రామాల్లో అభివృద్ధి జరగాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా మన పార్టీ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో త్వరలో శిక్షణ కార్యక్రమాలతో పాటు ఒక ‘లీగల్ సెల్’ను కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లీగ్ మ్యాచ్ రూపంలో అద్భుతమైన విజయం సాధించిన మనం, రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సెమీఫైనల్స్లో గెలిచి, భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ అనే ఫైనల్ ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకొని కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం’’ అని కేటీఆర్ అన్నారు.
లగచర్లలో గిరిజన ఆడబిడ్డలపై కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకు అండగా మహబూబాబాద్లో నిర్వహించిన భారీ సమావేశం తర్వాతనే లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మహబూబాబాద్ లాంటి మారుమూల జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కాలేజీని, జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు. నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ అని అన్నారు. రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, సదానందం, యాళ్ల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.

